పీఓకేలో తలదాచుకున్న మసూద్ అజార్

పీఓకేలో తలదాచుకున్న మసూద్ అజార్

నిషేధిత ఉగ్రవాద సంస్థ  జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కదలికలను పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో భారత నిఘా వర్గాలు గుర్తించాయి. తన స్థావరమైన బహవల్‌పురాకు దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో అతడు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బృందం తెలిపింది. భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్‌’లో10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన మసూద్ కొద్దిలో బతికిపోయాడు. 

సురక్షిత స్థావరానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న అతడు ఈమధ్యే  స్కర్దులోని సద్పర రోడ్డు పరిసరాల్లో కనిపించాడు. అతడు ఆశ్రయం పొందుతున్న చోట రెండు మసీదులు, వాటి అనుబంధ మదర్సాలతో పాటు పలు ప్రైవేట్, ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయని సమాచారం. నిఘా వర్గాలు తెలిపిన వివరాలతో పాకిస్థాన్ ఉగ్రవాదులకు అండగా ఉంటుందనడానికి మరోసారి నిరూపితం అయిందని భారత సైన్యం అంటోంది.

భారత దేశం జాబితాలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో మసూద్ ఒకడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను స్థాపించిన మసూద్ 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడితో పాటు 2019లో పుల్వామా దాడికి సూత్రధారి. అతడిని అంతమొందించాలని భారత సైన్యం బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్ చేసింది. కానీ, తప్పించుకొని సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాడు మసూద్. 

ఈమధ్యే పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’లో మసూద్ కుటుంబం భూస్థాపితమైంది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రమైన జమియా సుభాన్ అల్లా ప్రాంతంపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో అతడి సోదరుడు సహా పది మంది సన్నిహితులు హతమయ్యారు. అయితే మసూద్‌తో తమకు ఏ సంబంధం లేని పాక్ నేతలు ప్రగల్భాలు పలికారు. మసూద్ అఫ్గనిస్థాన్‌కు పారిపోయి ఉంటాడని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నాడు. ఒకవేళ భారత నిఘా వర్గాలు అతడిని పీఓకేలో గుర్తించినట్టు తమ దృష్టికి వస్తే సంతోషంగా అరెస్ట్ చేస్తామని భుట్టో తెలిపాడు.