జలవివాదంలో కేంద్రం సంధాన కర్త మాత్రమే

జలవివాదంలో కేంద్రం సంధాన కర్త మాత్రమే
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంలో కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తోందని, న్యాయవాది పాత్ర వహింపదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తన కృషి కారణంగానే బనకచర్లపై కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. 
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకుంటే బిఆర్ఎస్ కు ఎందుకు అభ్యంతరం అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
‘‘బనకచర్లపై నేను ప్రధాని మోదీని కలుసుకున్నా. మూడుసార్లు జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యా. బనకచర్ల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరాను. ఆ తర్వాతే, ఇద్దరు సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేశారు” అని తెలిపారు.  ఏ ఒక్క రాష్ట్రానికో అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరించబోదని ఆయన చెప్పారు. జలవివాదాలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం సంతోషకరమని కిషన్ రెడ్డి తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా బీజేపీ విధానాలు మార్చుకోదని బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి స్పష్టం చేశారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భేషజాలు లేవు. బేసిన్‌ల గొడవలు లేవు’’ అంటూ గతంలో అప్పటి ఏపీ సీఎం జగన్‌తో కలిసి ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశం సందర్భంగా కేసీఆర్‌ చేసిన ప్రకటనను కిషన్‌ రెడ్డి చదివి వినిపించారు.

కాగా, గోదావరి మిగులు జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఏమిటో చెప్పాలని కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. ‘‘మీ కంటే ఆరు నెలల తర్వాత చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు. గడచిన రెండేళ్లలో మీరేం చేశారు’’ అని నిలదీశారు. ‘‘ఎంతసేపూ కిషన్‌రెడ్డి ఏం చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏమిచ్చారు.. అంటూ పడికట్టు పదాలతో అబద్ధాలు వల్లె వేయడం తప్పితే రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క నిర్మాణాత్మక చర్య కూడా చేపట్టలేదు’’ అని ఆయన దుయ్యబట్టారు.

వచ్చే ఏడాది కాజీపేటలో రైలు ఇంజన్ల ఉత్పత్తిని ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ శనివారం వరంగల్‌లో పర్యటిస్తారని, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ పనులను సమీక్షిస్తారని, తర్వాత కాచిగూడ నుంచి రాజస్థాన్‌(జోధ్‌పూర్‌)కు రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారు. యాదగిరిగుట్ట వరకూ రూ. ౩౩౦ కోట్లతో రైలు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి హైదరాబాద్ నుంచి వెళ్ళే నేపథ్యంలో అక్కడ కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన చెప్పారు. వచ్చే జనవరిలో కొమురవెల్లి స్టేషన్‌ను పూర్తి చేసి మల్లన్న స్వామికి అంకితం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శంషాబాద్ తరహాలో రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్‌ను ఆధునీకరించనున్నట్లు వివరించారు.

కాగా, తెలంగాణ సరిహద్దులోని 12 గ్రామాలు తమవే అంటూ మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు చిన్నపిల్లాడిలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ, ఏపీ సీఎంలు ఒప్పుకొంటే వివాదాస్పద ఐదు గ్రామాలపై కూడా పార్లమెంటులో చట్టం తెస్తామని చెప్పారు. పార్లమెంటులో చట్టం అయిన తర్వాతే ఈ గ్రామాలను ఏపీలో విలీనం చేశారని ఆయన గుర్తుచేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే సక్రమంగా పంపిణీ చేయడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.