చెస్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

చెస్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

ప్రపంచ నెంబర్ 1 చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్ వరుస ఓటములతో ఒత్తిడిలో పడిపోయాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్లు అతడి ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు ముఖ్యమైన టోర్నీలలో డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానందా వంటి యువకులు కార్ల్‌సన్‌ ను చిత్తుచేసి భారత చెస్ ప్రతిభను ప్రపంచానికి చాటించారు. 

గ్రాండ్ చెస్ టూర్ 2025 జాగ్రెబ్ ఈవెంట్‌లో కార్ల్‌సన్‌ను గుకేశ్ చావు దెబ్బ కొట్టగా, ఇప్పుడు లాస్ వేగాస్‌లో రమేశ్ బాబు ప్రజ్ఞానందా ఓడించాడు. లాస్ వేగాస్ వేదికగా జరిగిన ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్లో 19 ఏళ్ల ప్రజ్ఞానందా కేవలం 39 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ ను ఓడించాడు. నార్వేకు చెందిన గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ ఇటీవల భారత ప్రస్తుత ఛాంపియన్ డి.గుకేశ్ చేతుల్లో వరుస పరాభవాలను చవి చూశాడు.

ఇది సాంప్రదాయ చెస్‌కి భిన్నంగా, చెస్ 960 (ఫిశర్ ర్యాండమ్ చెస్) ఫార్మాట్‌లో జరిగింది. తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానందా, 93.9% ఖచ్చితత్వంతో అద్భుతంగా ఆడి, కార్ల్‌సన్ (84.9%)కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ విజయం ద్వారా ప్రజ్ఞానందా వైట్ గ్రూప్‌లో 4.5 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. 

ఈ ఏడాది ఇప్పటికే మూడు టోర్నమెంట్లు గెలుచుకున్న ప్రజ్ఞానంద ఇప్పుడు కార్ల్‌సన్‌ను క్లాసికల్, రాపిడ్, బ్లిట్స్ మూడు ఫార్మాట్లలోనూ ఓడించాడు. కార్ల్‌సన్‌ను ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలవడం విశేషం. ఈ ఓటమితో పాటు మరో మ్యాచ్‌లో వెస్లీ సో చేతితోనూ ఓడిన కార్ల్‌సన్ ఈ ఈవెంట్‌ను బయటకు వెళ్లిపోయాడు.

వైట్ గ్రూప్‌లో ఉన్న ప్రజ్ఞానంద మొదటగా అబ్దుసత్తోరోవత్‌తో జరిగిన మ్యాచ్‌‌లో డ్రా, తర్వాత అసౌబాయేవా, కీమర్‌పై వరుస విజయాలు సాధించాడు. చివరగా కార్ల్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎత్తుగడలు వేస్తూ విజయం సాధించడమే కాకుండా 4.5 పాయింట్లతో గ్రూప్ టాప్‌లో నిలిచాడు.