హెచ్‌సీఏలో అక్రమాలపై కేటీఆర్, కవితలపై సంచలన ఆరోపణలు

హెచ్‌సీఏలో అక్రమాలపై కేటీఆర్, కవితలపై సంచలన ఆరోపణలు

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలపై అక్రమాల ఆరోపణలు చేసి, వారిని వివాదంలోకి లాగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన (హెచ్‌సీఏ)లో చోటుచేసుకున్న అనేక విధ్వంసక చర్యల వెనుక కేటీఆర్, కవితల హస్తం ఉందని టీసీఏ స్పష్టం చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి కలిసి సీఐడీ డీజీ చారుసింహాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

టీసీఏ ఇచ్చిన ఫిర్యాదులో కేవలం రాజకీయ నేతలే కాకుండా, హెచ్‌సీఏకి సంబంధించి మరికొంతమందిపై కూడా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. వీరిలో జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లు ఉన్నారు. వీరి ఆచరణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని టీసీఏ విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అధికారం దూకుడుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవికి జగన్‌మోహన్‌రావు చేరుకున్నారన్నది టీసీఏ ఆరోపణ.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అసోసియేషన్‌ కార్యకలాపాలు దారి తప్పాయని పేర్కొంది. కేవలం సీఐడీకే కాకుండా, ఆర్థిక వ్యవహారాల దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది. హెచ్‌సీఏ అక్రమాల్లో మనీలాండరింగ్ కోణం ఉందని అనుమానిస్తూ, ఆ దిశగా విచారణ జరిపించాలని కోరింది. ఇప్పటికే హెచ్‌సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు అందజేయాలని సీఐడీనీ ఈడీ కోరింది .

మరోవంక, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనకు సంబంధం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‎సీఏ) వ్యవహారంలో తలదూర్చడంతో ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‎లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‎సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్‎సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్‎ను తప్ప మిగిలిన అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. దేవరాజ్ పరార్ కావడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే ముందుగా సమాచారం ఇవ్వడమే కారణమని అధికారులు గుర్తించారు.