లిక్క‌ర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు చైత‌న్య భ‌గేల్ అరెస్టు

లిక్క‌ర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు చైత‌న్య భ‌గేల్ అరెస్టు

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేష్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ని ఈడి శుక్రవారం అరెస్ట్‌ చేసింది. లిక్కర్‌ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.దుర్గ్‌ జిల్లాలోని భిలారులో బఘేల్‌ నివాసాన్ని సోదా చేసిన కొద్దిసేపటికే ఈడి అరెస్ట్‌ జరిగింది.  మార్చిలో కూడా బఘేల్‌ నివాసంలో సోదాలు చేపట్టింది. అయితే మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణానికి సంబంధించి సోదాలు చేపట్టినట్లు ఈడి తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,160 కోట్లకు పైగా నష్టం కలిగించిన ఆర్థిక నేరంలో వచ్చిన ఆదాయాన్ని చైతన్య తీసుకున్నారని గతంలో ఈడి ఆరోపించిన సంగతి తెలిసిందే.  2019-2022 మధ్య కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్కామ్‌ జరిగినట్లు ఆరోపించింది. లిక్క‌ర్ స్కామ్‌లో త‌మ‌కు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి జనవరిలో రాష్ట్ర మాజీ వర్తక, వాణిజ్య పన్ను శాఖ మంత్రి కవాసి లఖ్మాను ఈడి అరెస్ట్‌ చేసింది. తన కుమారుడు చైతన్య అరెస్టును భూపేష్‌ బఘేల్‌ ధ్రువీకరించారు. 

తన కుమారునికి ‘పుట్టినరోజు బహుమతి’ ఇచ్చినందుకు అధికార బిజెపిలో అత్యున్నత నేతలైన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు ధన్యవాదాలు అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మోదీ, షాలు ఇచ్చిన బహుమతిని ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ ఇవ్వలేరని, ఈ బహుమతిని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఎద్దేవా చేశారు.

ఈ కేసులో గతంలో ఐఏఎస్ అధికారి అనిల్ తూతేజా, లిక్కర్ వ్యాపారి అన్వర్ ధేబర్ (రాయ్‌పూర్ మేయర్ సోదరుడు) సహా పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. మాజీ ఎక్సైజ్ మంత్రి కవాసి లఖ్మా, మాజీ చీఫ్ సెక్రటరీ వివేక్ ధండ్ వంటి 70 మంది వ్యక్తులు, కంపెనీలపై కూడా ఛత్తీస్‌గఢ్ ఈఓడబ్ల్యూ/ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈడి ఇప్పటి వరకు సుమారు రూ. 205 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.