వంద జిల్ల్లాలో అభివృద్ధి కోసం ధన ధాన్య కృషి యోజన

వంద జిల్ల్లాలో అభివృద్ధి కోసం ధన ధాన్య కృషి యోజన

దేశవ్యాప్తంగా వంద జిల్ల్లాలో అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం సమావేశం యాక్సియం – 4 మిషన్‌ విజయం కావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు సురక్షితంగా వెళ్లి తిరిగివచ్చిన భారతీయ వ్యోమగామి శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. 

క్యేబినేట్‌ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. రైతుల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపేరు. ఈ పథకం కింద 100 జిల్లాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. 11 విభాగాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న 36 రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం ఉన్న పథకాలను ఏకీకృతం చేస్తూ ఈ పథకం అమలవుతుందని తెలిపారు. 

రూ.24 వేల కోట్లతో ఈ పథకం అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన పంటకోత తర్వాత నిల్వను పెంచుతుందని చెప్పారు. పంటల వైవిధ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని, ఈ కార్యక్రమంతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని వివరించారు. 

అలాగే, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌టిపిసి రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌, జాయింట్‌ వెంచర్స్‌, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌టిపిసి లిమిటెడ్‌కు విద్యుత్‌ కేటాయింపును పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం కమిటి (సిసిఈఎ) ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎన్‌టిపిసి అనుబంధ సంస్థ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కేటాయింపును మంజూరు చేసిందని తెలిపారు. 

ఎన్‌టిపి ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌ రూపంలో ఎన్‌జిఈఎల్‌లో ఇప్పటి వరకు రూ. 7,500 పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. ఇక ఎన్‌జిఈఎల్‌లో రూ. 20 వేల కోట్ల పెట్టుబడికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపారు. దీంతో 2032 నాటికి 60 గిగా వాల్ట్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. 

నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (సిపిఎస్‌ఈలు) వర్తించే ప్రస్తుత పెట్టుబడి మార్గదర్శకాల నుండి ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సిఐఎల్‌)కు ప్రత్యేక మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం కమిటి (సిసిఈఎ) ఆమోదించిందని థెయ్ల్పారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎన్‌ఎల్‌సిఐఎల్‌ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్‌ఎల్‌సి ఇండియా రెన్యూవబుల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఆర్‌ఎల్‌)లో రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి, ఎన్‌ఐఆర్‌ఎల్‌ వివిధ ప్రాజెక్టులలో నేరుగా, లేకపోతే జాయింట్‌ వెంచర్ల ఏర్పాటుతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని వివరించారు.