డ్రగ్స్ నిందితుల్లో ఇద్దరు పోలీసుల కుమారులు

డ్రగ్స్ నిందితుల్లో ఇద్దరు పోలీసుల కుమారులు
 
హైదరాబాద్​లోని కొంపల్లిలో మహిళల చెప్పులలో డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తున్న మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య డ్రగ్స్ దందా కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయగా కేసులో ఏ2 గా ఉన్న పల్లెపాక మోహన్ ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు కాగా పరారీలో ఉన్న మరో నిందితుడు రాహుల్ తేజ్ కూడా పోలీసు అధికారి కుమారుడు కావడం గమనార్హం.

ఎస్‌ఐబీ (ఓఎస్‌డీ)గా పనిచేస్తున్న అధికారి కొడుకు రాహుల్‌ తేజ హోటల్‌ వ్యాపారాల్లో ఉన్నాడు. డ్రగ్స్‌ దందాలోనూ ఇతడి పాత్ర ఉంది. 2024లో నిజామాబాద్‌లో అతడిపై డ్రగ్స్‌ కేసు నమోదైనా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. , ఆ కేసులో మూడో నిందితుడిగా రాహుల్‌ తేజ ఉన్నట్టు ఈగల్‌ అధికారులు గుర్తించారు. సూర్యను ఈగల్‌ అధికారులు విచారిస్తుండగా, రాహుల్‌ తేజ పేరు బయటకు వచ్చింది. 

రాహుల్‌తేజ్‌పై ఏమైనా కేసులున్నాయా? అనే కోణంలో ఆరా తీయగా, నిజామాబాద్‌లో నమోదైన కేసు బయటపడింది. ఈ కేసులో రాహుల్‌ హిమచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ తెచ్చి తమకు అమ్మేవాడని మిగతా నిందితులు చెప్పినట్టు అధికారులు గుర్తించారు. ఆ కేసులో ఏ3 నిందితుడైన రాహుల్‌ తేజ మినహా మిగతా వారంతా అరెస్ట్‌ కావడం, బెయిల్‌పై బయటకు రావడం జరిగింది. 

సైబరాబాద్‌ కార్‌ హెడ్‌క్వార్టర్స్‌ డీసీపీగా పనిచేస్తున్న మరో అధికారి కొడుకైన మోహన్‌ అక్రమ దందా కూడా బయటపడింది. ఇతడు కూడా హోటల్‌ దందాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హోటళ్లు, పబ్‌ వ్యాపారాలు నిర్వహించే మోహన్‌ సూర్యతో స్నేహంగా ఉంటూ ఈ డ్రగ్స్‌ దందాలో చేరినట్టు పోలీసుల విచారణలో బయటపడటంతో అతడిని కూడా అరెస్ట్‌ చేశారు. 

హైదరాబాద్‌ కొంపల్లిలోని మల్నాడు రెస్టరెంట్ నిర్వాహకుడు సూర్య వద్ద మాదకద్రవ్యాలున్నాయనే సమాచారంతో ఇటీవల సైబరాబాద్ ఈగల్ టీమ్ పోలీసులు బృందం రెస్టారెంట్ వద్ద నిఘా ఉంచింది. ఈనెల 7న రాత్రి రెస్టారెంట్‌కు స్కార్పియోలో వచ్చిన సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని స్కార్పియో డాష్ బోర్టులో డ్రగ్స్ ఉన్నట్లు అంగీకరించాడు.

తనిఖీ చేయగా 3.2 గ్రాముల ఓజి వీడ్, 1.6 గ్రాముల 3 ఎక్ట్ససీ మాత్రలు లభించాయి. అనంతరం కారు ఫ్రంట్ సీట్ కింద దాచిన పార్సిల్‌ వెతకగా మహిళల చెప్పులు లభ్యమయ్యాయి. చెప్పు హీల్‌ లోపల 10గ్రాముల కొకైన్ దొరికింది. వాటితోపాటు నిందితుడి ఐఫోన్, స్కార్పియో కారును పోలీసులు జప్తు చేశారు. పబ్‌లో మాదకద్రవ్యాలు సేవించినట్లు అంగీకరించిన సూర్య పోలీసుల విచారణలో పలు అంశాలను వెల్లడించాడు.