ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరించామన్న యుకె

ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరించామన్న యుకె
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక నివేదికలో ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంపై ప్రస్తావించిన విషయం విదితమే. దీంతో ఇంధన స్విచ్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ యూకేకు చెందిన పౌర విమానయాన అథారిటీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాద ఘటనకు నాలుగు వారాల ముందే బోయింగ్‌ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై హెచ్చరికలు చేసినట్లు వెల్లడించింది. 
 
787 డ్రీమ్‌లైనర్‌తో సహా ఐదు రకాల బోయింగ్‌ విమానాల ఇంధన స్విచ్‌లపై మే 15న ఓ భద్రతా నోటీసు జారీ చేసినట్లు సీఏఏ తెలిపింది. అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) నిర్వహించిన ఎయిర్‌వర్తినెస్‌ డైరెక్టివ్‌లో ఆయా విమానాల్లో ఇంజిన్‌ ఇంధన షటాఫ్‌ వాల్వ్‌ యాక్టువేటర్స్‌ గురించి హెచ్చరికలు చేసిందని పేర్కొంది. 
 
దీంతో ఆయా విమానాల ఇంధన షట్‌ ఆఫ్‌ వాల్వ్‌లకు రోజువారీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళుతున్న ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ జూన్‌ 12న టేకాఫ్‌ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. రెండు ఇంజిన్లకు రెప్పపాటు (సెకను) వ్యవధిలో ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు నివేదిక నిర్థారించింది. 
 
దీంతో బోయింగ్‌ విమానాల్లో ఇంధన స్విచ్‌లపై చర్చ ఊపందుకుంది. మరోవైపు ఈ స్విచ్‌లపై డీజీసీఏ దేశీయ విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. తమవద్ద ఉన్న బోయింగ్‌ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్‌ లాకింగ్‌ వ్యవస్థలను తనిఖీ చేయాలని సూచించింది. అనంతరం సంబంధిత నివేదికలను డీజీసీఏకు సమర్పించాలని పేర్కొంది.