వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది
* భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
 
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా రంగం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.

ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా? అని అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెబుతూ ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని పలికింది. కానీ, ప్రతి ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని, తనను ఎవరూ లెక్కచేయడం లేదని అమ్మవారు చెప్పింది. 

తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ కాపాడుకుంటున్నానని పలికింది. రాసుల కొద్దీ సంపదను తాను రప్పించుకుంటున్నా గోరంతైనా తనకు దక్కడం లేదని, సక్రమంగా పూజలు జరిపించాలి బాలకా అంటూ అమ్మవారు ఆగ్రహించింది. తాను కన్నెర్ర జేస్తే రక్తం కక్కుకుని చస్తారంటూ హెచ్చరించింది. 

కాలానుగుణంగా ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, తాను అడ్డురానని స్వర్ణలత తెలిపింది. ఏడాది ఒక్కసారి కాదు నిత్యం కొలిచే వారికే తన ఆశీస్సులు ఉంటాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి  చెప్పింది. అమ్మవారి ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానమిస్తూ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తాము దగ్గరుండి పూజలు చేయిస్తున్నానని తెలిపారు. 

ఇక నుంచి ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లు జరగనివ్వమబోమని, ఆనందించి తమను ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నారు. దీంతో అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత శాంతించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, కానీ తాను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాని చెప్పారు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని, తాను అడ్డురానని పేర్కొన్నారు.

“బోనాల జాతరకు సంతోషంగా సాకలు పోసి బాగా చేశారు. ప్రతీసారి చేసినట్టే ఈ సారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెబుతునా.. నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు.. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు” అని చెప్పుకొచ్చారు.

“నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను. నాకు రక్తం బలి కావాలి. నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడుతాను. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది. ప్రజలు జాగ్రత్త ఉండాలి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి” అని ఆమె తెలిపారు.  “ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి. ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు” అని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.