ఎల్‌ఐసీలో 1 శాతం వాటా విక్రయం

ఎల్‌ఐసీలో 1 శాతం వాటా విక్రయం
ప్రభుత్వ రంగంలోని బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మరోసారి వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈక్విటీలో 1 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్‌) ద్వారా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఓఎఫ్ఎస్‌ ద్వారా రూ.5,850 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఈ వాటా విక్రయంపై పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఎల్‌ఐసీ 2022 మే నెలలో తన ఈక్విటీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించి రూ.21,000 కోట్లు సమీకరించింది. సెబీ నిబంధనల ప్రకారం కంపెనీ 2027 మే నాటికి తన ఈక్విటీలో కనీసం 10 శాతం అంటే మరో 6.5 శాతం వాటాను ప్రజలకు విక్రయించాలి. 

అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మార్కెట్‌ పరిస్థితులను బట్టి దశల వారీగా విక్రయించాలని ఎల్‌ఐసీ యోచిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం ఈక్విటీ వాటా ను త్వరలో ఓఎఫ్ఎస్‌ ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం.

2022 మే నెలలో రూ.21,000 కోట్ల సమీకరణకు ఎల్‌ఐసీ రూ.902-949 ధరల శ్రేణితో ఐపీఓకు వచ్చింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఇష్యూ దాదాపు మూడు రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. అయితే షేర్ల లిస్టింగ్‌ తొలి రోజే 8 శాతం నష్టంతో మదుపరులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఒక్కో షేరును రూ.949 చొప్పున జారీ చేయగా 2023 మే నెలలో ఒకదశలో ఎల్‌ఐసీ షేరు రూ.567కు పడిపోయింది. 

గత 52 వారాల్లో ఒక దశలో రూ.1,221.5కి చేరినా మళ్లీ వెంటనే నష్టాల బాట పట్టింది. గురువారం కూడా బీఎ్‌సఈలో ఎల్‌ఐసీ షేరు 2.01 శాతం నష్టంతో రూ.926.85 వద్ద ముగిసింది. ఇది ఐపీఓ ధరతో పోల్చితే రూ.22.15 తక్కువ. ఈ నేపథ్యంలో కంపెనీ జారీ చేసే ఓఎఫ్ఎస్ కు మదుపరులు నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందన్నది పెద్ద ప్రశ్న.