దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు ఆమోదం

దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు ఆమోదం

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌ లింక్‌కు భారత్‌లో కమర్షియల్‌గా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులను ఇండియన్ నేషనల్ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్-స్పేస్) మంజూరు చేసింది. దీని కాల వ్యవధి ఐదేళ్ల పాటు ఉంటుందని వెల్లడించింది. 2022 నుంచి కమర్షియల్‌ లైసెన్స్‌ పొందేందుకు ఎదురుచూస్తున్న ఈ సంస్థకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

కాగా అంతకుముందు గత నెలలోనే టెలికాం విభాగం నుంచి స్టార్‌ లింక్‌ అనుమతులు పొందింది. తాజాగా స్పేస్‌ ఏజెన్సీ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్‌ లింక్‌కు లైన్ క్లియర్ అయ్యింది. స్టార్‌ లింక్‌తో పాటు రిలయన్స్‌ జియో, వన్‌వెబ్‌కు ఇప్పటికే ఈ తరహా అనుమతులు లభించాయి. 

దీని తర్వాత ఇంకా ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ పొందడం, బేస్‌ స్టేషన్ల ఏర్పాటుకు మౌలిక వసతులు సమకూర్చుకోవడంతో పాటు తమ సేవలు సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు లోబడి ఉన్నాయని నిరూపించేందుకు ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. సామాన్యులకు స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవడానికి ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావాల్సి ఉంటుంది.

స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్‌ ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. ఇది సంప్రదాయ శాటిలైట్ సేవల మాదిరిగా సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడకుండా లియో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. భూమికి 550 కిలోమీటర్లు ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌లింక్‌కు చెందిన 6,000 శాటిలైట్లు తిరుగుతూ ఇంటర్నెట్ అందిస్తాయి.

స్టార్‌లింక్ భారత్కు రావడం వల్ల ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందిచడంలో ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని భావిస్తున్నా,రు. ప్రభుత్వ ఆన్లైన్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు అందించవచ్చని చెబుతున్నారు. పర్వత ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఘండ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర లాంటి అడవులు ఉన్న రాష్ట్రాలతో పాటు మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌ వంటి వాటికి ఈ స్టార్లింక్ సేవలు చాలా ప్రయోజకనరంగా మారనున్నాయి.