కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీకే రుణాలు

కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీకే రుణాలు

రైతన్నలకు మేలు చేకూర్చాలనే సదుద్దేశంతో కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల(కేసీసీ) రుణ పరిమితిని కేంద్రం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినప్పటికీ ఫలితం లేకపోతోంది. ఆశించిన మేర కార్డుల జారీ లేకపోవడంతో అన్నదాతలకు లబ్ధి చేకూరడం లేదు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు 7 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఇందులో రూ.లక్ష లోపు రుణాలకు 3 శాతం రాయితీని కేంద్రం ఇస్తే, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 

అంటే రూ.లక్షలోపు లోన్లకు సున్నావడ్డీ, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల్లోపు రుణాలకు సంబంధించి పావలా వడ్డీ ఉంటుంది. కొన్నేళ్లుగా కేంద్రం రాయితీ వర్తింపజేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వక రైతులపై వడ్డీ భారం పడుతోంది. జగిత్యాల జిల్లాలో 2.95 లక్షల మంది రైతులుండగా 25 వేల కంటే తక్కువ మందికి మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశారు.

రైతులు రుణం తీసుకున్నపుడు బ్యాంకుల్లో కేసీసీ పత్రాలపై సంతకాలు చేసి తీసుకుంటున్నప్పటికీ కార్డులు జారీ చేయడం లేద19-69 ఏళ్ల వయసు వారు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి లేదా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు వెబ్‌సైట్‌లో అప్లై చేసుకొని కార్డును పొందే వీలుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తును బ్యాంకులో అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. కిసాన్‌ కార్డుకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది.

బ్యాంకులో పంట రుణం తీసుకున్నపుడు మంజూరు చేసిన మొత్తాన్ని రైతు పొదుపు అకౌంట్కు జమ చేస్తారు. అప్పటి నుంచి తిరిగి చెల్లించే వరకు వడ్డీని లెక్కిస్తారు. కానీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుంటే ఈ అకౌంట్లోనే పంట రుణం మొత్తం జమవుతుంది. కార్డు ద్వారా ఎన్ని డబ్బులు వినియోగిస్తే అంత మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది.

ఇప్పటికే ఏటీఎం కార్డు ఉంటే దాన్ని కిసాన్‌ క్రెడిట్‌కార్డు అకౌంట్కు లింక్‌ చేయించుకుంటే కార్డును సాధారణ ఏటీఎంగా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుగానూ ఉపయోగించుకోవచ్చు. లావాదేవీలు జరిపినపుడు రెండు అకౌంట్లు కనిపిస్తాయి. ఒకదాన్ని ఎంచుకొని డబ్బు వెచ్చించవచ్చు. జగిత్యాల జిల్లాలోని 83 వేల పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్ లబ్ధిదారులందరికీ కార్డులు ఇవ్వాల్సి ఉంది.

కేసీసీతో ఏడాది పొడవునా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేసుకోవచ్చు. పీవోఎస్‌(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల ద్వారా కొన్నపుడు రాయితీలు వర్తిస్తాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా అదనంగా కేంద్రం నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లోన్ను పొందవచ్ఛు పావలా వడ్డీ, సురక్ష బీమా యోజన వర్తిస్తాయి.