29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు

29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు

బెట్టింగ్​ యాప్స్​ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు రానా, విజయ్​ దేవరకొండ, ప్రకాశ్​రాజ్​, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్​, శ్రీముఖి వంటి తదితరులపై సైబరాబాద్​ పోలీసుల ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది.  సినీ సెలబ్రిటీలు, ఇన్​ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్స్​ను పీఎంఎల్​ఏ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. 

నిషేధిత బెట్టింగ్​ యాప్​లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి పైనా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.  నటులు రానా దగ్గుబాటి, విజయ్​ దేవరకొండ, ప్రకాశ్​రాజ్​, ప్రణీత, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్​, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, బుల్లితెర నటులు, ఇన్​ఫ్లూయెన్సర్లు శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణి సౌందరరాజన్​, శోభాశెట్టి, వసంతి కృష్ణన్​, నేహాపఠాన్​, నయని పావని, పద్మావతి, పండు, విష్ణు ప్రియ, ఇమ్రాన్​ఖాన్​, భయ్యా సన్నీయాదవ్​, హర్షసాయి, రీతూ చౌదరి, బండారు సుప్రీత, టేస్టీ తేజ తదితరుల పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చారు.

పలు సెక్షన్లు కింద కేసు నమోదు : బీఎన్​ఎస్​లోని 318(4), 112, రెడ్​విత్​ 49, తెలంగాణ గేమింగ్​ యాక్ట్​లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయింది. హైదరాబాద్​ పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేయనుంది.  చట్టవిరుద్ధ యాప్​లను డౌన్​లోడ్​ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇందుకు వారు భారీగా కమీషన్​, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్​ల కారణంగా అప్పుల పాలై, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో ప్రముఖ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలతోపాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్ కేసులు నమోదు అయ్యాయి.

అలాగే  శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. వీరందరినీ పీఎమ్ఎల్ఏ కింద విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా అందరి స్టేట్‌మెంట్స్ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఏమోనని టాలీవుడ్ లో టెన్షన్ నెలకొంది.