
రాజ్యాంగం ద్వారానే పౌరులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం దక్కుతుందని అంబేద్కర్ చెప్పారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. దేశంలో అన్నింటికన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనదని చెప్పిన అంబేద్కర్, న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా ఉండకుండా స్వేచ్ఛగా ఉండాలని ఆకాంక్షించారని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పౌరుల హక్కులను కాపాడేందుకు న్యాయవ్యవస్థ కాపలాగా ఉండాలని అంబేద్కర్ తెలిపారని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో మనందరిని రాజ్యాంగం ఐక్యంగా ఉంచుతుందని అంబేద్కర్ అభిప్రాయపడినట్లు చెప్పారు. రాజ్యాంగం నిశ్చలంగా ఉండదని, ఇది ఎప్పుడూ మారుతూ ఉంటుందని అంబేద్కర్ అన్నారని తెలిపారు.
రాజ్యాంగం కారణంగా మహిళలు, వెనుకబడిన వర్గాలను జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చారని ఆయన చెప్పారు. మనకు ఒక మహిళా ప్రధానమంత్రి, ఇద్దరు మహిళా అధ్యక్షులు, వెనుకబడిన వర్గాలకు చెందిన కె ఆర్ నారాయణన్, రామ్ నాథ్ కోవింద్ రాష్రపతులుగా, జీఎంసీ బాలయోగి, బాలయోగి మీరా కుమార్ లోక్ సభ స్పీకర్లుగా, వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక మంది సభ్యులు ప్రధాన కార్యదర్శులు, డిజిపిలుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
దేశాన్ని పాలించేవారు కుల, మతాలను దాటి కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. అంతకుముందు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ను మహారాష్ట్ర అసెంబ్లీ సన్మానించింది. అత్యున్నత న్యాయ పీఠాన్ని అందకున్న ఆయనను అభినందిస్తూ మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
తొలుత, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ దిగువ సభలో గవాయిని అభినందించడానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర శాసన మండలిలో చైర్పర్సన్ రామ్ షిండే తరువాత ఇలాంటి అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జస్టిస్ గవాయ్ను శాసనసభ తరఫున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సన్మానించారు.
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. సీజేఐ జస్టిస్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ బిహార్, కేరళ గవర్నర్గా పనిచేశారు. అంబేద్కర్ వాది అయిన ఆర్ ఎస్ గవాయ్ పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేసి అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ రికార్డు సాధించారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనృ 2025 మే 14న భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఆయన పదవీకాలం 2025 నవంబర్ 23వరకు ఉంటుంది. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయ్ ఆరేళ్ల కాలంలో సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. అనేక సంచలన కేసుల తీర్పుల్లో భాగస్వామిగా జస్టిస్ గవాయ్ ఉన్నారు.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!