గుజరాత్‌లో వంతెన కూలి 10 మంది మృతి

గుజరాత్‌లో వంతెన కూలి 10 మంది మృతి

గుజరాత్‌లోని వడోదరలో బుధవారం తెల్లవారుజామున వంతెన కూలిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి సంఘ్వీ తెలిపారు. ఆగుగురిని కాపాడినట్లు వెల్లడించారు. పద్రా వద్ద మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీర వంతెన కూలటంతో నాలుగు వాహనాలు నదిలో పడ్డాయి.  సమాచారం అందుకున్న వెంటనే పోలీసులుసహా వివిధ శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వడోదర-ఆనంద్‌ పట్టణాలను కలిపే గంభీర వంతెన కూలటంతో ఆ రెండు పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  గుజరాత్ నుంచి సౌరాష్ట్రకు వెళ్లే వాహనాలకు ఈ వంతెన ప్రధాన మార్గంగా ఉంది. 45 ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ వంతెన సరైన మరమ్మతులు లేకపోవడం వల్లే కూలిపోయిన కూలిపోయిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

ప్రమాదం విషయం తెలియగానే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అదికారులను అప్రమత్తం చేశారు. నిపుణులను సంఘటనా స్థలానికి పంపి వంతెన కూలిపోవడానికి గల కారణాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.  కులిపోయన వంతెనను 1985లో నిర్మించినట్లు మంత్రి రుషికేష్ పటేల్ పేర్కొన్నారు. అవసరమైనప్పుడు దాని నిర్వహణను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటాం’ అని ఆయన చెప్పారు.

‘ఒక ట్రక్కు, ఒక ఎకో, కొన్ని బైక్‌లు కింద పడిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వంతెనపై ఇరుక్కుపోయిన ట్యాంకర్ కింద పడకుండా చర్యలు తీసుకుంటున్నాం రెస్క్యూ బృందాలు చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి’ ఆనంద్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ చౌదరి పేర్కొన్నారు. ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని ఆనంద్- వడోదరలను కలిపే వంతెనలో ఒక భాగం కూలిపోయిందని తెలిపారు. మూడు నుంచి నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి  కింద బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.