భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ లకు చోటు కల్పించాలి

భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ లకు చోటు కల్పించాలి
అంతర్జాతీయ వేదికలు మరింత ప్రజాస్వామికం, ప్రాతినిధ్యం, సమర్ధవంతంగా ఉండేందుకు ఐరాస భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ లకు చోటు కల్పించాలని 17వ బ్రిక్స్ డిక్లరేషన్ పిలుపిచ్చింది. ఐక్యరాజ్యసమితిలో, ముఖ్యంగా భద్రతా మండలిలో సత్వరం సంస్కరణలు అవసరమని ఉమ్మడి ప్రకటన స్పష్టం చేసింది. “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా దాని సమగ్ర సంస్కరణకు మా మద్దతును మేము పునరుద్ఘాటిస్తున్నాము. తద్వారా అది మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రాతినిధ్యంగా, ప్రభావవంతంగా మరియు సమర్థవంతంగా మారుతుంది” అని ప్రకటన పేర్కొంది.
 
“సమకాలీన భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కౌన్సిల్‌లో ఎక్కువ ప్రాతినిధ్యం అవసరమని మేము నొక్కి చెబుతున్నాము” అని ఆ ప్రకటన వివరించింది.  ఎజుల్విని ఏకాభిప్రాయం, సిర్టే డిక్లరేషన్‌లో హైలైట్ చేయబడిన ఆఫ్రికన్ దేశాల చట్టబద్ధమైన ఆకాంక్షలను ఈ పత్రం స్పష్టంగా సమర్థించింది. అంతర్జాతీయ నిర్ణయాత్మక ప్రక్రియలలో వారి సరైన ప్రాతినిధ్యం కోసం పిలుపునిచ్చింది.
కాగా, బ్రిక్స్​కు సరికొత్త నిర్వచనం ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బిల్డింగ్ రెసిలెన్స్​ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోపరేషన్ అండ్ సస్టెనబులిటీగా పుననిర్వచిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది బ్రిక్స్ దేశాలకు భారత్​ అధ్యక్షత వహించనున్న తరుణంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. తాము అధ్యక్షత వహించిన జీ20లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన అన్ని అంశాలపైనా చర్చించినట్లే బ్రిక్స్​ సమ్మిట్​లో చర్చిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఈ క్రమంలోనే బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు బ్రెజిల్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. “మన ఆరోగ్యం ఈ విశ్వం ఆరోగ్యం రెండూ ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం ఉంది. వైరస్​లు వీసాలోతో రావని, పాస్​పోర్ట్లతో పరిష్కారాలు కనుక్కోలేమని మనకు కరోనాతో తెలిసింది. అందుకే మన ప్రపంచాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలి” అని మోదీ పిలుపిచ్చారు. 
“అతిపెద్ద ఆరోగ్య కవరేజ్ పథకం ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించినందుకు  గర్వంగా ఉంది. మన ఆరోగ్య వ్యవస్థలను మరింత ప్రభావవంతంగా మార్చడానికి మేము సాంకేతికత శక్తిని ఉపయోగించుకున్నాము. ఆరోగ్యాన్ని మరింత పెంచే శక్తివంతమైన సాంప్రదాయ వైద్య విధానాలు కూడా మా వద్ద ఉన్నాయి” అని ప్రధాని చెప్పారు.

అంతకుముందు ఉగ్రవాదం అంశంపైనా బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు ఉగ్రవాదమని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్​పై జరిగిన దాడి మాత్రమే కాదని, మొత్తం మానవాళిపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదంపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 
 
ఉగ్రవాదులకు నిధులు, ప్రోత్సాహం, ఆవాసం అందించే వారిని అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ఎద్దేవా చేశారు. అనంతరం ఉరుగ్వే, బొలివియా అధ్యక్షులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, దానిని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. పాక్‌ ఉగ్రవాదానికి మద్దతుదారని, భారత్‌ ఉగ్రవాద బాధిత దేశమన్నారు. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో బ్రిక్స్ గ్రూపు నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనంటూ తీవ్రంగా ఖండించారు.
జమ్ముకశ్మీర్‌లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్‌ నేతలు వివరించారు. 

ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో ​​డి జనీరో డిక్లరేషన్ వెల్లడించింది. బ్రెజిల్​లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సవేశంలో అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణ, శాంతి, భద్రత, అభివృద్ధి సమస్యలు, కృత్రిమ మేధస్సు వంటి వాటిపై నేతలు చర్చించారు.