తుర్కియే సంస్థ సెలెబికి హైకోర్టులో చుక్కెదురు

తుర్కియే సంస్థ సెలెబికి హైకోర్టులో చుక్కెదురు
సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేసిన తుర్కియే సంస్థ సెలెబి ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సెలిబి ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
 
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తుర్కియే దేశం బహిరంగంగా పాకిస్థాన్‌కు మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే బీసీఏఎస్ మే 15న భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్యూరిటీ అనుమతిని రద్దు చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 
 
అయితే దీనిని సెలెబి ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ఇండియా సవాలు చేసింది. 17 ఏళ్లుగా తమ కంపెనీలు భారత్‌లో సేవలందిస్తున్నాయని, 10,000 మందికి పైగా పనిచేస్తున్నారని, వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండానే తమ అనుమతులు రద్దు చేశారని హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై విచారణ అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ సచిన్ దత్తా తీర్పుచెప్పారు.

విచారణ సందర్భంగా సెలెబి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదన వినిపించారు. తమ సంస్థకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసే అధికారం డీసీఏఎస్ డీజీకి లేదని ఆయన వాదించారు. ఇందువల్ల వివిధ విమానాశ్రయాల్లో కంపెనీ ఆపరేట్ చేస్తున్న కార్గో హ్యాండ్లింగ్ కాంట్రాక్టులు రద్దయ్యాయని చెప్పారు. 

సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రూల్-12 ను అత్రికమించారని పేర్కొన్నారు. సివిల్ ఏవియేషన్ భద్రతకు డైరెక్షన్లు ఇచ్చే అధికారమే డీజీకి ఉందని, భద్రతా క్లియరెన్స్‌ను రద్దు చేసే అధికారం లేదని తెలిపారు. కాగా, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ దేశంలోని భద్రతా పరిస్థితులకు ముప్పు తలెత్తే అవకాశం ఉన్నందునే సెలిబి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు. 

2022 నవంబర్‌లో సెక్యూరిటీ క్లియెరెన్స్ ఇచ్చే సమయంలో ఎలాంటి కారణం లేకుండానే సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయడానికి, ఆ అధికారం బీసీఏఎస్ డీజీకి ఉంటుందనడానికి సెలిబి సంస్థ అంగీకారం తెలిపిందని చెప్పారు.