అసెంబ్లీ, పార్లమెంటుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది

అసెంబ్లీ, పార్లమెంటుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది
ప్రధాని నరేంద్ర మోదీ గారు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం తీసుకురావడంతో రాబోయే రోజుల్లో అసెంబ్లీలు, పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగనుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. 
 
బిజెపి మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు సందర్భంగా ప్రజాస్వామ్యం విలువల పరిరక్షణపై హైదరాబాద్‌లోని కెఎంఐటి కళాశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ సెషన్‌లో పాల్గొంటూ  ఈ మాక్ పార్లమెంట్ సెషన్ లో పాల్గొన్న విద్యార్థుల్లో కొంతమంది భవిష్యత్తులో అసెంబ్లీ లేదా పార్లమెంట్ సభ్యులుగా మారవచ్చని అభిలాష వ్యక్తం చేశారు. 

ఇక్కడి విద్యార్థులు చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులు ప్రదర్శిస్తున్న తీరు లెజిస్లేటివ్ బిహేవియర్ కి ఉదాహరణగా, ప్రస్తుత శాసనసభల కంటే మెరుగైన విధంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు.  ప్రస్తుత రాజకీయాలలో అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్‌లు చూసి, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీవీ చూడవద్దని చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే అసెంబ్లీలో అసభ్య పదజాలం వినిపిస్తోందని అంటూ విచారం వ్యక్తం చేశారు.

ఈ మాక్ పార్లమెంట్ రాజకీయ అంశం కాదని, ఇది విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదిక అని చెప్పారు. పెద్ద కుటుంబాల వారికే రాజకీయాల్లో చోటుంటుందన్న భావన తప్పని అంటూ ఆసక్తి, నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశముంటుందని తెలిపారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చాలామంది మహిళా ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ మాక్ పార్లమెంట్ ఎమర్జెన్సీ  కాలంలో ప్రజలపై జరిగిన అణచివేతను, చరిత్రలోని చీకటి రోజులను గుర్తు చేస్తుందని చెప్పారు.


భవిష్యత్తులో దేశంలో యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. నైతిక విలువలతో కూడిన, నీతిమంతమైన రాజకీయాల‌ను ప్రవేశపెట్టాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, అందుకే దేశవ్యాప్తంగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి రావాలని ప్రధాని పిలుపునిచ్చారని గుర్తు చేశారు.

ఈ మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న యువతీ యువకులు. భవిష్యత్తులో పార్లమెంట్‌లో వాదించాల్సిన స్థాయికి ఎదగాలని అభిలాషను వ్యక్తం చేశారు. 1975లో ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, పౌర హక్కులను అణచివేసి, పత్రికా స్వేచ్ఛను హరించి ఎమర్జెన్సీ విధించబడింది అని గుర్తు చేశారు. ఆనాడు కేబినెట్‌లో చర్చించకుండా, అర్ధరాత్రి రాష్ట్రపతిని బలవంతంగా సంతకం చేయించి తెల్లారేసరికి లక్షలమందిని అరెస్ట్ చేశారని చెప్పారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి ఈ కార్యక్రమంకు సారధ్యం వహించారు.