“నాన్-పర్ఫార్మింగ్” అకౌంట్ గా మారిపోయిన తెలంగాణ

“నాన్-పర్ఫార్మింగ్” అకౌంట్ గా మారిపోయిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం “నాన్-పర్ఫార్మింగ్” అకౌంట్ (ఎన్పీఏ)గా మారిపోయిందని బిజెపి శాసనసభ పక్ష ఉప నాయకుడు పాయల్ శంకర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటూ  అసెంబ్లీ సమావేశాలు వెంటనే ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో 50 శాతం మంది రైతులకు కూడా మాఫీ చేయకుండా ఉన్నదని, ఇది కూడా ప్రభుత్వ పాలనలో ఎన్పీఏగానే భావించాల్సిన పరిస్థితని పేర్కొన్నారు.

మూడు సీజన్ లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొత్తాన్ని కేవలం ఒకే సీజన్ లో మాత్రమే ఇచ్చి, దాంట్లో కూడా చాలామందికి కోతలు పెట్టి ప్రభుత్వం ఎన్పీఏ అయిపోయిందని తెలిపారు.  సివిల్ సప్లై కార్పొరేషన్‌కు ప్రభుత్వం సమయానికి చెల్లింపులు చేయకపోవడం వల్ల ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ కూడా మందలించిందని చెప్పారు.

ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థలు రుణాలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకులు ఆ సంస్థలను ఎన్పీఏలుగా ప్రకటించబోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనూ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ, 10-11% వడ్డీకి రుణాలు తీసుకుంటున్నా కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి వెనకడుగేయడం ఆర్థిక అనిశ్చితిని సూచిస్తున్నదని శంకర్ ధ్వజమెత్తారు.

గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాయని చెబుతూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీపై, కేంద్ర మంత్రులపై, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గత 11 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణకు కేంద్రం రూ.11 లక్షల కోట్లు ఇవ్వగా, బీఆర్ఎస్ హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందని శంకర్ తెలిపారు.

స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని చెప్పారని, అయితే  మరోవైపు ఎనిమిది ఎంపీలు ఉన్నా కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే సహకరించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేసేటటువంటి పరిస్థితి లేదని, ప్రతి నెలా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తయారు చేసి ఈరోజు ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో కాలేజీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయని, అయితే  కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయని అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు పేషెంట్లను పట్టించుకునే పరిస్థితిలో లేదని, కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫీజు రీయింబర్స్‌మెంట్ జాప్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారని శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రాల్లో గుంతలు పూడ్చే పరిస్థితి లేకపోవడం రాష్ట్రంలోని దుస్థితిని స్పష్టం చేస్తోందని చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అప్పులరాష్ట్రంగా మార్చేశాయని చెబుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై  అనవసర నిందలు మోపుతూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పులను మించి, ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఎక్కువ అప్పులు చేస్తుందని  దుయ్యబట్టారు.