
75 చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. దాంతో సుప్రీంకోర్టులో నాన్-జ్యుడీషియల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నారు.
సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానం 23 జూన్ 2025 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఇది భారత సుప్రీంకోర్టులో పరిపాలనా పనితీరులో భారీ మార్పునకు సంకేతంగా నిలుస్తున్నది. అయితే, ఈ రిజర్వేషన్లు న్యాయమూర్తులకు వర్తించదు. రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ తదితర పోస్టులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కింద మూడు కేటగిరిలు ఉంటాయి. అవి ఎస్సీ, ఎస్టీ, నాన్ రిజర్వ్డ్.
రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్ విధానం వర్తిస్తే సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉండాలి? మన విలువలు, మన చర్యలకు అద్దం పట్టాలని తెలిపారు.
జూన్ 24న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) ఉద్యోగులకు సుప్రీంకోర్టులో 15 శాతం రిజర్వేషన్లు లభించనుండగా, షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. రోస్టర్ లేదంటే రిజిస్టర్లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తినట్లయితే వాటి గురించి రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్)కు తెలియజేయవచ్చని సర్క్యులర్ పేర్కొంది.
More Stories
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్