ఆలయానికి నటి త్రిష విరాళంగా రోబో ఏనుగు

ఆలయానికి నటి త్రిష విరాళంగా రోబో ఏనుగు

ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ జంతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైలోని ఓ ప్రముఖ ఆలయానికి రోబోటిక్ ఏనుగును కానుకగా ఇచ్చారు. ఈ సాంకేతిక అద్భుతాన్ని ‘పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా’ (పి ఎఫ్ సి ఐ) అనే జంతు సంక్షేమ సంస్థతో కలసి అందించడంతో, సాంప్రదాయాలను కాపాడుతూనే మూగజీవాలకు హాని కలగకుండా ఉండే మార్గాన్ని ఆమె సూచించారు.

చెన్నైలోని శ్రీ అష్టలింగా ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి త్రిష విరాళంగా అందించిన రోబోటిక్ ఏనుగుకు `గజ’ అని పేరు పెట్టారు. వేదమంత్రాల నడుమ, మంగళవాయిద్యాల శబ్దంలో ఈ యాంత్రిక ఏనుగును ఆలయానికి శాస్త్రోక్తంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్‌సీఐ సంస్థ ప్రతినిధులు పాల్గొని పూజారులకు ఏనుగును అధికారికంగా అప్పగించారు. 

ఇకపై ఈ యాంత్రిక ఏనుగు ఆలయ పూజలు, ఊరేగింపులు, ఉత్సవాలలో ముఖ్య పాత్ర పోషించనుంది. సాంప్రదాయాలు, ఆచారాల ఉల్లంఘన కాకుండా, వాటిని కొనసాగించేందుకు ఇది మంచి మార్గమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

సంప్రదాయ ఉత్సవాలలో అసలైన ఏనుగులను వినియోగించడం వల్ల అవి తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతుండడం తెలిసిందే. ఎక్కువ శాతం ఏనుగులు బలవంతంగా శిక్షణ ఇవ్వబడి, భారీ శబ్దాలు, జనజీవనం మధ్య ఉద్విగ్నంగా ఉంటూ తమ సహజ జీవనశైలిని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష చేసిన ఈ గొప్ప పని జంతు ప్రేమికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
 
మూగజీవాల బాధను గమనించి, వాటికి నష్టం లేకుండా సంప్రదాయాలను నిలబెట్టడం కోసం ఆమె చేసిన ఈ ప్రయత్నం మానవత్వాన్ని చాటుతోంది. ‘‘త్రిష వంటి ప్రముఖులు ఇలాంటి బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటే అది సమాజానికే మేలు’’ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జంతువుల పట్ల కరుణ చూపించడంతోపాటు సాంప్రదాయాలకు పరిరక్షణ కల్పించడానికి ఆమె చేసిన ప్రయత్నం ఎంతోమందికి ఆదర్శంగా మారింది.