ఎనిమిది మంది తమిళనాడు మత్స్యకారుల అరెస్ట్

ఎనిమిది మంది తమిళనాడు మత్స్యకారుల అరెస్ట్
 
ఎనిమిది మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేటాడారనే ఆరోపణలపై ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని రామేశ్వరం నుండి వీరిని అరెస్ట్‌ చేయడంతో పాటు బోటును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం 466 బోట్లకు టోకెన్లు జారీ చేసినట్లు మత్య్యశాఖ అధికారులు తెలిపారు.

వర్కోడు, మండపం, రామేశ్వరానికి చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి వేటాడి ఆదివారం ఒడ్డుకు రావాల్సివుంది. అరెస్టయిన మత్స్యకారులు ఎస్‌.జేసు(35), (యజమాని, డ్రైవర్‌), ఎన్‌.అన్నామలై (55), వి.కళ్యాణరామన్‌ (45),ఎస్‌. సయ్యద్‌ ఇబ్రహీం(35), ఎన్‌.మునీశ్వరన్‌ (35),యు.సెల్వం (29), గాంధీవేల్‌లను దనుష్కోటి, తలైమన్నార్‌ సమీపంలో చేపలుపడుతుండగా శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 

ఎనిమిదిమందిని శ్రీలంకలోని తలైమన్నార్‌లోని నావల్‌ పోర్ట్‌కు తరలించినట్లు సమాచారం. అరెస్ట్‌వార్తతో తీర ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన అలముకుంది.  అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా  ఖండించాయి.  జూన్‌ 15తో చేపల వేటపై రెండు నెలల వార్షిక నిషేధ కాలం ముగిసిందని ఒక మత్స్యకారుడు తెలిపారు. 

వేట సీజన్ కావడంతో సముద్రంలోకి వెళ్లారని, కచ్చితంగా చెప్పాలంటే ఈ 12 రోజుల్లో వారు సముద్రంలోకి వెళ్లడం ఇది నాలుగోసారని చెప్పారు. శ్రీలంక నేవీ తప్పుడు అభియోగంతో వారిని అరెస్ట్‌ చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం శ్రీలంకతో చర్చలు జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారుల సంఘం నేత జె.ఆర్‌. జేసురాజా డిమాండ్‌ చేశారు. 

తాము ఆందోళనలతో విసిగిపోయామని పేర్కొంటూ ఇటీవల కాలంలో శ్రీలంక ప్రభుత్వం భారీ జరిమానా విధించిందని, జైలు శిక్ష కూడా విధించాలని ఆదేశించిందని తెలిపారు.  ఈ దాడులతో అప్పులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చేపల వేటకు దూరంగా ఉండటం తప్ప మరో మార్గంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.