విమాన ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్‌

విమాన ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్‌
అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్‌ నిర్ణయించింది. ఇందుకోసం బోర్డును అనుమతి కోరినట్లు తెలిసింది. ఈ ట్రస్ట్‌కు రూ.500 కోట్లు కేటాయించేలా  అనుమతి కోరినట్లు సమాచారం. 
 
జూన్ 12న జరిగిన విషాదం తర్వాత గురువారం జరిగిన మొదటి బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.  అధికారుల సమాచారం ప్రకారం ఈ ట్రస్ట్‌కు కేటాయించే సొమ్ముతో ప్రమాదంలో మరణించిన 271 బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. అంతేకాదు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, ప్రమాదం జరిగిన సమీపంలో దెబ్బతిన్న మెడికల్‌ కాలేజీ పునరుద్ధరణ, విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం వంటి పనులు ఈ ట్రస్ట్‌ ద్వారా చేపట్టనున్నారు. 
 
మిగిలిన మూల ధన సొమ్మును బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలు తీర్చేందుకు వినియోగించాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ట్రస్ట్‌ను రిజిస్టర్‌ చేసి.. దేశ, విదేశాల్లోని బాధితుల కుటుంబాలకు నేరుగా సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పీబీ బాలాజీ నేతృత్వం వహిస్తారు.