ఎట్టకేలకు రోదసిలోకి శుభాన్షు శుక్లా

ఎట్టకేలకు రోదసిలోకి శుభాన్షు శుక్లా
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ‘యాక్సియం-4’ మిషన్‌లో భాగంగా శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్‌-9 రాకెట్‌ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 
 
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.

అమెరికా ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ యాక్సియం చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్‌-4’ మిషన్‌ లో భాగంగా స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా శుభాన్షు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. దీంతో ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కారు. 

ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. భూమి నుంచి బయల్దేరిన 28గంటల తర్వాత ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్ఎస్‌తో అనుసంధానమవుతుంది.

వ్యోమనౌకలోకి వెళ్లేముందు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తనకు ఎంతో ఇష్టమైన పాటను విన్నారు. గతేడాది విడుదలైన హృతిక్‌ రోషన్‌ నటించిన ‘ఫైటర్‌’ చిత్రంలోని ‘వందేమాతరం’ పాట అంటే శుభాన్షుకు ఎంతో ఇష్టమట. ఈ సందర్భంగా రోదసి యాత్రకు వెళ్లే ముందు ఆ పాటను విన్నారు. ‘విజయం అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఉంటుంది. మన పరాక్రమం అలాంటిది. శత్రువు కూడా మనకు సెల్యూట్‌ చేస్తాడు’ అంటూ సాగే దేశభక్తిని రగిలించే ఈ పాటను కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌ 39-ఎకి వెళుతూ విన్నారు.

యాక్సియమ్‌ స్పేస్‌ సంస్థ చేపట్టిన నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర కావడం వల్ల ఈ మిషన్‌కు యాక్సియమ్‌-4గా పేరు పెట్టారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మిషన్​ ఎట్టకేలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం (జూన్​ 26) సాయంత్రం 4:30 గంటలకు డాకింగ్ జరగుతుంది. శుక్లాతో పాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్‌ కపు, పోలాండ్‌కు చెందిన మరో నిపుణుడు స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ అంతరిక్షకు వెళ్లారు.