పైలట్ అభినందన్ బంధించిన పాక్ అధికారి కాల్చివేత

పైలట్ అభినందన్ బంధించిన పాక్ అధికారి కాల్చివేత
2019లో భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను తాను బంధించానని చెప్పిన 37 ఏళ్ల పాకిస్తాన్ ఆర్మీ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మరణించారు. పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలోని దక్షిణ వజీరిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
 
మేజర్ మోయిజ్ పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ ఎస్ జి)లో భాగంగా ఉన్నాడు. ఆ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్నప్పుడు అతన్నీ కాల్చి చంపారు. పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించినట్లుగా, లాన్స్ నాయక్ జిబ్రానుల్లా అనే సైనికుడు కూడా అదే ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.  2019లో, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త ప్రతిష్టంభన సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది.
పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం బాలకోట్‌లో వైమానిక దాడులు చేసినప్పుడు ఇది జరిగింది.  అభినందన్ మిగ్-21 ఫైటర్ జెట్‌ను నడుపుతున్నాడు. పాకిస్తాన్ జెట్‌లతో వైమానిక యుద్ధంలో పాల్గొన్నాడు. అతని విమానం కూలిపోయింది. అతను పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోకి దూసుకెళ్లాడు. అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతన్ని విడుదల చేయగా భారతదేశానికి తిరిగి ఇచ్చారు.