
ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 30 శాతం రవాణా అవుతుంది. భారత్ చమురు దిగుమతులకు సైతం హర్మూజ్ జలసంధి కీలకమే. ఇది పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. ఇరుకైన ప్రదేశంలో దాదాపు 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఇరుకైన ఛానల్, ఇరాన్ (ఉత్తరం)ను అరేబియా ద్వీపకల్పం (దక్షిణం) నుంచి వేరు చేస్తుంది.
ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ దాదాపు రెండుకోట్ల బ్యారెల్స్ చమురు వివిధ దేశాలకు వెళ్తుంటుంది. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ నుంచి జలసంధి ద్వారా ఎగుమతి అవుతుంది. కూడ్రాయిల్తో పాటు గ్యాస్ రవాణాకు సైతం ఈ జలసంధి కీలకం. మూడింట ఒక వంతు గ్యాస్ సైతం ఈ మార్గం నుంచే పలు దేశాలకు వెళ్తుంది.
భారత్ తన అవసరాల్లో 90శాతం ముడి చమురును వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో 40శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ దేశాల నుంచి భారత్ ఎక్కువగా చమురును దిగుమతు చేస్తుంటుంది. చమురుతో వచ్చే నౌకలు ఒమన్, ఇరాన్ సముద్రమార్గంలో ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తూ దేశానికి చేరుకుంటాయి.
ఇప్పుడు దాన్ని మూసివేయడంతో భారత్ తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే, హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్పై ప్రభావం పడే అవకాశాలున్నా రష్యా, అమెరికా, బ్రెజిల్ ద్వారా దిగుమతి చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని పరిశ్రమ విశ్లేషకులు తెలిపారు.
కాగా, గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించామని వెల్లడించారు. అయితే భారత్ సరఫరాల్లో ఎక్కువ భాగం ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదని స్పష్టం చేశారు.
చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండటంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పౌరులకు ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరో వైపు ప్రపంచదేశాలు వినియోగించే గ్యాస్లో 20శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. క్రూడాయిల్, గ్యాస్ నౌకలన్నీ ఈ జలసంధి ద్వారానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో చమురు ధరలు బ్యారెల్కు 80 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రూడాయిల్ ప్రస్తుతం బ్యారెల్కు 74డాలర్లకుపైగా ఉండగా, బ్రెంట్ 77.27 డాలర్లు పలుకుతున్నది.
More Stories
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్