తప్పుడు మ్యాప్ పై భారత్ కు ఇజ్రాయిల్ క్షమాపణలు

తప్పుడు మ్యాప్ పై భారత్ కు ఇజ్రాయిల్ క్షమాపణలు
తప్పుడు భారత్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఇజ్రాయెల్ సైన్యం శనివారం క్షమాపణలు చెప్పింది. భారత సరిహద్దులను కచ్చితత్వంతో ఆ మ్యాప్‌లో చూపలేకపోయినందుకు చింతిస్తున్నామని పేర్కొంది. తాము ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన మ్యాప్‌లో జమ్మూకశ్మీరును పాకిస్తాన్‌లోని భూభాగంగా చూపించినందుకు క్షమాపణలు తెలిపింది.

ఇరాన్‌ వద్దనున్న మిస్సైళ్ల రేంజ్‌ వివరాలతో ఓ మ్యాప్‌ను శుక్రవారం రోజు ఇజ్రాయెల్ సైన్యం పోస్ట్ చేసింది. అందులో జమ్ముకశ్మీరును పాక్ భూభాగంగా చూపించారు. దీన్ని చూసి భారతీయ నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. జమ్ముకశ్మీరును పాక్ భూభాగంగా ఎలా చూపిస్తారని నిలదీశారు. వెంటనే ఈ తప్పుడు మ్యాప్‌ను సవరించాలని డిమాండ్ చేశారు.  ఈ పొరపాటును గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం ఆ మ్యాప్‌ను పోస్ట్ చేసినందుకు క్షమాపణలు చెప్పింది.

ఇరాన్ మిస్సైళ్ల రేంజ్ సమాచారంతో ఒక షార్ట్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులోనూ తప్పుడు ఇండియా మ్యాప్‌ను ప్రదర్శించారు.  పొరపాటు జరిగిందని గుర్తించిన వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. క్షమాపణలు చెబుతూ మరో పోస్టు పెట్టింది. ఆ ట్వీట్‌లో  ‘ఈ పోస్టు కేవలం ఆ ప్రాంతాలకు సంబంధించిన ఉదాహరణ మాత్రమే. సరిహద్దుల్ని చక్కగా చూపించటంలో ఈ మ్యాప్ ఫెయిల్ అయింది. ఈ ఫొటో వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిఉంటే మమ్మల్ని క్షమించండి’ అని పేర్కొంది.

తాను ఈ పొరపాటును గుర్తించిన వెంటనే సంబంధిత విభాగానికి సమాచారాన్ని అందించానని ఆ తప్పుడు మ్యాప్‌ను తొలగించడమో, సవరించడమో చేయాలని కోరానని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ర్యూవెన్ అజార్ తెలిపారు. ఇజ్రాయెల్ – ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మధ్యవర్తిత్వం వహించే ప్రభావశీలత భారత్‌కు ఉందని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌ పేర్కొన్నారు. 

“ఇరుదేశాలతోనూ చర్చలు జరిపే సఖ్యత భారత్‌కు ఉంది. భారత్‌ మాకు మిత్రదేశం. దాని మధ్యవర్తిత్వంతో అత్యంత నిబద్ధతతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ సంతోషంగా అంగీకారం తెలుపుతుంది. భారత్ ఆందోళనలను ఇజ్రాయెల్ నిశిత పరిశీలనలోకి తీసుకుంటుంది. భారత్ ధర్మబద్ధంగా వ్యవహరిస్తుందనే విశ్వాసం మాకు ఉంది” అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూవెన్‌ అజార్‌ తెలిపారు.

ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు తెచ్చేలా అణుబాంబు తయారీకి ఇరాన్ యత్నిస్తోందని రూవెన్ అజార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చాలాసార్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ చెప్పామని తెలిపారు. అందుకే ఇరాన్‌లోని న్యూక్లియర్ తయారీ కేంద్రాలపై దాడులు చేసినట్లు చెప్పారు. రాబోయే మూడేళ్లలో 10వేల బాలిస్టిక్ మిస్సైళ్లను, రాబోయే ఆరేళ్లలో 20వేల మిస్సైళ్లను తయారు చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోందని పేర్కొంటూ అవి తమ ఉనికికే ముప్పుని పేర్కొన్నారు.