ఇజ్రాయిల్‌- హమాస్‌ యుద్ధంపై ఓటింగ్ కు భారత్ దూరం

ఇజ్రాయిల్‌- హమాస్‌ యుద్ధంపై ఓటింగ్ కు భారత్ దూరం

ఇజ్రాయిల్‌- హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం విరమించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో ఓటింగ్‌ జరిగింది. దీనికి భారత్‌ గైర్హాజరు అయింది. ఈ ఓటింగ్‌లో 149 దేశాలు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ తో పాటు 10 దేశాలు వ్యతిరేకించాయి.భారత్‌ సహా మరో 19 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. 

దక్షిణాసియా, బ్రిక్స్‌, ఎస్‌సీఓ దేశాల్లో భారత్‌ ఒక్కటే ఓటింగ్‌ కి దూరంగా ఉంది. గత డిసెంబర్‌ 2024లో ఇటువంటి ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసిన భారత్‌, ఆరు నెలల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడుతూ గాజాలో సంక్షోభం పై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసిందని, అయితే ఇజ్రాయిల్‌,పాలస్తీనా సమస్యను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించాలని భావిస్తోందని చెప్పారు. 

గతంలో కూడా ఇజ్రాయిల్‌ కు అనుకూలంగా ఉన్న ప్రతిపాదనలపై భారత్‌ గైర్హాజరైనదని ఆయన తెలిపారు. 1988లో భారత్‌ పాలస్తీనాను గుర్తించింది. ప్రస్తుతం 193 ఐరాస సభ్య దేశాల్లో 147 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ జూన్‌లో పాలస్తీనాను గుర్తించే అవకాశం ఉందని చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ సమావేశంలో దేశాలు పాల్గొనవద్దని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

ఫ్రాన్స్‌, సౌదీ అరేబీ దేశాలు జూన్‌ 17-20 తేదీల్లో సమావేశం నిర్వహిస్తున్నాయి. దీని లో భారత్‌ పాల్గొనాలని ఫ్రాన్స్‌ కోరుతుంది. ఈ సమావేశం ఇజ్రాయిల్‌-పాలస్తీనా ల రెండు దేశాల పరిష్కారం కోసం చర్చలు జరుపుతుంది. అయితే, భారత్‌ ఈ సమావేశంలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్ధకం. స్పెయిన్‌ ప్రతిపాదించిన ఈ యుద్ధ విరమణ ప్రతిపాదనకు ఐరాసలో 80 శాతం దేశాలు మద్దతు ఇచ్చాయి. 

రష్యా రాయబారి వాసిలీ నెబెంజ్యా మాట్లాడుతూ గాజాలో మరణాల సంఖ్య 55,000కు చేరడం ఆమోదయోగ్యం కాదని, వెంటనే యుద్ధ విరమణ అవసరమని పేర్కొన్నారు. ఐరాస సంస్థల నివేదికల ప్రకారం, గత మూడు నెలల్లో ఆహారం లేక అనేక మంది పిల్లలు మరణించారు. సుమారు 20 లక్షల మందిలో సగం మంది తీవ్ర ఆకలి, పోషకాహార లోపం, అనారోగ్యంతో బాధపడుతున్నారు.