
చిన్న పిల్లల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే డయేరియాకు టీకాను అభివృద్ధి చేయటానికి బహుళజాతి ఫార్మా కంపెనీ జీఎస్కే పీఎల్సీతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జట్టు కట్టింది. తద్వారా షిగెల్లా టీకా క్యాండిడేట్ అయిన ఆల్ట్సోన్ఫ్లెక్స్ 1-2-3 అభివృద్ధిలో కీలకమైన భాగస్వామి అవ్వనుంది. ఆల్ట్సోన్ఫ్లెక్స్ 1-2-3పై నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు వచ్చాయి.
ఆఫ్రికా దేశాల్లో నిర్వహించిన రెండో దశ పరీక్షల్లో భద్రతపరంగా ఎటువంటి సవాళ్లు కనిపించలేదు. నిర్దేశిత వ్యాధి నిరోధకతనూ ఈ టీకా ప్రదర్శించినట్లు స్పష్టమైంది. ఆల్ట్సోన్ఫ్లెక్స్ 1-2-3 టీకా క్యాండిడేట్ను జీఎస్కే ఆవిష్కరించింది. ఈ టీకాను అభివృద్ధి చేసి, పూర్తిస్థాయి టీకాగా రూపుదిద్దే పనిలో ఇకపై భారత్ బయోటెక్ భాగస్వామి అవ్వనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లైసెన్స్ పొందిన షిగెల్లా టీకా ఏదీ లేదు.
ప్రస్తుతానికి క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి టీకాగా గుర్తింపు పొందే అవకాశం ఆల్ట్సోన్ఫ్లెక్స్ 1-2-3 టీకా క్యాండిడేట్కే కనిపిస్తోంది. ఇది అత్యాధునికమైన జనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటీజెన్స్ – జీఎంఎంఏ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద రూపుదిద్దుకుంటోంది. వ్యాధి నిరోధకత సాధించడం కోసం బ్యాక్టీరియాలోని బాహ్య మెంబ్రేన్ల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థకు ఓ-యాంటీజెన్ పంపించడం ఈ సాంకేతిక పరిజ్ఞానంలోని ఒక ప్రత్యేకత.
అత్యాధునిక టీకాను ఆవిష్కరించటానికి తాము సిద్ధమవుతున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న పిల్లల ప్రాణాలు కాపాడగలమని ఆయన పేర్కొన్నారు. ఈ టీకా క్యాండిడేట్పై మూడో దశ క్లినికల్ పరీక్షలను భారత్ బయోటెక్ చేపట్టనుంది. ఆ తర్వాత అవసరమైన అనుమతులు తీసుకొని టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!