ఇరాన్ అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు

ఇరాన్ అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు
ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై ముందస్తు దాడి అని పిలిచే దాడిని ప్రారంభించింది. అణు సౌకర్యాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ చర్య తీసుకుంది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యూట్యూబ్ ప్రసంగంలో “ఈ ముప్పును తొలగించడానికి ఎన్ని రోజులు పట్టినా అన్ని రోజులు” సైనిక ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
టెహ్రాన్‌లో పేలుళ్లు సంభవించాయని, ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ దాడికి ప్రతిస్పందనగా దేశ వైమానిక రక్షణలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇరాన్ త్వరలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు. “ఇరాన్‌పై ఇజ్రాయెల్ రాష్ట్రం ముందస్తు దాడి తర్వాత, ఇజ్రాయెల్, దాని పౌర జనాభాపై క్షిపణి, డ్రోన్ దాడి త్వరలో జరగవచ్చు” అని కాట్జ్ ప్రకటించారు.
ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా జరుపుతున్న చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ దేశ అణు స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులకు సిద్ధమవుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.  ‘అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి’ అని పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఈ సందర్భంగా పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.
 
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా? అని మీడియా ప్రశ్నించగా ‘వారు (ఇరాన్‌) అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అంతే!’ అని స్పష్టం చేశారు. భద్రతాపరమైన ముప్పు ఎటువంటిదో తెలుపకుండానే అమెరికా తన సిబ్బందిని తరలిస్తున్నదని, దీంతో చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయని ఇరాకీ వర్గాలు పేర్కొన్నాయి. 
 
బహ్రెయిన్‌, కువైట్‌లోని తమ సిబ్బంది అక్కడే ఉండాలా లేక తరలిపోవాలా అన్నది వారి నిర్ణయానికే వదిలేశామని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇజ్రాయెల్‌లో ఉంటున్న తమ దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు టెల్‌అవీవ్‌ నగరం దాటి వెళ్లవద్దని అమెరికా ఒక ప్రకటనలో సూచించింది. క్షిపణి, మోర్టార్‌, రాకెట్‌ లేదా డ్రోన్‌ల ద్వారా దాడులు జరిగితే ఎక్కడ దాక్కోవాలో అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది. 
 
పశ్చిమాసియాలో అమెరికన్ల భద్రత వాతావరణం అత్యంత సంక్లిష్టంగా ఉందని, అది ఏ క్షణమైనా మారిపోవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్‌ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్‌ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. 
తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నసీర్‌జాదేహ్‌ పేర్కొన్నారు.
 
ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్‌, అమెరికా మధ్య ఆరో దఫా చర్చలు జరుగుతాయని ఒమన్‌ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా, తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.  అమెరికాకు మధ్యప్రాచ్యంలో ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సైనిక స్థావరాలు ఉన్నాయి. అలాగే, పశ్చిమాసియాలో కీలక భాగస్వామిఇరాక్‌లోని రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని తరలించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో అమెరికాకు 2,500 మంది బలగాలు ఉన్నాయి.