
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాతో ట్రేడ్ డీల్ కుదిరినట్లు తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్లో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము కూడా ఒప్పందంలో భాగంగా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని, వారు అమెరికాలో చదువుకునేందుకు వీలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
‘ట్రేడ్ డీల్లో భాగంగా ఇకపై చైనా చేసే ఎగుమతులపై 55 శాతం సుంకాలు ఉంటాయి. అమెరికా నుంచి చైనాకు అయ్యే ఎగుమతులపై 10 శాతం సుంకాలు ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. గత నెలలో జెనీవాలో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని దెబ్బతీసిన ఖనిజ, సాంకేతిక ఎగుమతులపై వివాదాలను పరిష్కరించడానికి మార్గాన్ని కనుగొనడంపై ఈ చర్చలు దృష్టి కేంద్రీకరించాయి. ‘అమెరికాతో వాణిజ్యానికి చైనా ద్వారాలు తెరిచేందుకు జిన్పింగ్ సిద్ధంగా ఉన్నారు. నేను కూడా అందుకోసమే జిన్పింగ్తో కలిసి పనిచేస్తున్నాను. ఇది రెండు దేశాలకు మంచి విజయం అవుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాతో చైనాకు గల గణనీయమైన వాణిజ్యంపై నెలకొన్న ప్రాథమిక విభేదాలను పరిష్కరించడంలో పురోగతి సాధించారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ముందుగా ప్రతికూలతలను పరిష్కరించుకుని ముందుకు సాగడంపైనే దృష్టి పెట్టామని అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుత్నిక్ విలేకర్లతో వ్యాఖ్యానించారు. పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి చర్యలు తీసుకోవాలని గత వారంలో ట్రంప్, జిన్పింగ్లో ఫోన్కాల్ సంభాషణ అనంతరం ఈ చర్చలు జరిగాయి. తదుపరి దఫా చర్చలు జరిగే అవకాశం ఏమైనా వుందా లేదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు.
చైనా, అమెరికాలు పరస్పరం విధించుకున్న సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేసేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. జెనీవా ఒప్పందాలపై తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడంలోనే విలువైన సమయం వృథా అయిందని, ఇక 60 రోజులే మిగిలిందని, కానీ పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా వున్నాయని ఆసియా సొసైటీ ఆఫ్ పాలసీ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యక్షుడు కట్లర్ వ్యాఖ్యానించారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?