
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్హౌస్ అధికారులు తెలిపారు. కొలరాడోలో యూదు సమూహంపై ద్రావణ సీసాలతో ఓ వ్యక్తి దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాడ్, కాంగో రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలపై ట్రంప్ నిషేధం విధించారు. పాక్షికంగా నిషేధం విధించిన మరో ఏడు దేశాల జాబితాలో బురుండి, క్యూబా, లావోస్, సియోర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనిజులా ఉన్నాయి.
దేశ భద్రతను, అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడటానికి కోసమే ఈ చర్య తీసుకోవల్సి వచ్చిందని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. “కొలరాడోలోని బౌల్డర్లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్లో జరిగిన విధంగా మన మాతృభూమిలో జరగనివ్వను” అని స్పష్టం చేశారు.
“అందుకే సురక్షితం కానీ దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేం. యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా” అని ట్రంప్ తెలిపారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. 2017లో ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ నిషేధం విధించారు.
2018లో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక, 2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళికల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా యెమెన్ వంటి దేశాల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని గతంలో తెలిపారు. దేశ భద్రతకు ముప్పు అని భావించేవారిని అమెరికాలోనికి ఎన్నటికీ రానివ్వబోమని పేర్కొన్నారు.
కాగా, ట్రంప్ ప్రకటనపై వెనిజువెలా మంత్రి డియోస్టాడో కాబెల్లో స్పందిస్తూ యూఎస్లో ఉండటం వెనిజువెలా ప్రజలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రమాదమే అని ఎద్దేవా చేశారు. అందుకే తమ దేశ పౌరులు అగ్రరాజ్యంలో పర్యటించవద్దని సూచనలు ఇచ్చారు. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక