ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఐఈడీల నిర్వీర్యం

ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఐఈడీల నిర్వీర్యం
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని 10 ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు. కూబింగ్‌లో భాగంగా ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం వాటిని బలగాలు నిర్వీర్యం చేసి.. స్వాధీనం చేసుకున్నాయి. 
 
ఆదివారం ఉదయం కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కుతుల్ గ్రామం ఖోడ్పర్, గుర్మ్కా అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఆ క్రమంలో వీటిని అవి గుర్తించాయి. ఇక ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు నక్కి ఉండే అవకాశం ఉందంటూ భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో బీడీఎస్‌ బృందాలతో కలిసి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పటికే జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణించారు. అలాగే వందల మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంకోవైపు మావోయిస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేంద్రం ఇటీవల విడుదల చేసింది. గతంలో కంటే మావోయిస్టుల హింస దాదాపుగా అంటే.. పూర్తిగా తగ్గిపోయిందని తెలిపింది. 2010లో మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు 1936 ఉంటే అవి 2024 నాటికి 374కు తగ్గిపోయాయని వివరించింది. అంటే దాదాపు 81 శాతం మేర మావోయిస్టుల హింస తగ్గిందని సోదాహరణగా వివరించింది. 

అలాగే దేశంలో 2013లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126గా ఉంటే, వి 2021 నాటికి 70, ఇక ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి అవి 18కి పరిమితమైనాయని గణాంకాలతో సహా సోదాహరణగా వివరించింది. మావోయిస్టుల హింసలో 2010 నాటికి 720 మంది పౌరులు మరణిస్తే, 2019కి ఆ సంఖ 150కి చేరిందని, ఇక 2023లో 106, 2024లో 131, ప్రస్తుత ఏడాది మాత్రం 19 మంది మరణించారని కేంద్రం గణాంకాలతో సహా వివరించింది.