ప్రజల ఆయుఃప్రమాణంలో2 నెలల తగ్గుదల

ప్రజల ఆయుఃప్రమాణంలో2 నెలల తగ్గుదల
దేశ వ్యాప్తంగా ప్రజల ఆయుఃప్రమాణంలో (ఎక్స్‌పెక్టేషన్‌ ఆఫ్‌ లైఫ్‌ ఎట్‌ బర్త్‌) తగ్గుదల నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా ప్రజల ఆయుఃప్రమాణం సగటున రెండు నెలల కాలం తగ్గినట్లు తేలింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ‘డౌన్‌ టు ఎర్త్‌ ‘ ఒక కథనాన్ని ప్రచురించింది. 
 
రెండు నెలల కాలం తక్కువగానే కనిపించినప్పటికీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయుఃప్రమాణాల లెక్కల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ గణాంకాల ప్రకారం 2016- 2020 మధ్య 70 సంవత్సరాలుగా ఉన్న జీవిత కాలం 2017-2021 మధ్య కాలంలో 69.8 సంవత్సరాలకు తగ్గింది. 
 
గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక నెల కాలం, పట్టణ ప్రాంతాల్లో సగటున మూడు నెలల కాలపు జీవితకాలం తగ్గినట్లు తేల్చారు. 1970-75లో దేశవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం49.7 సంవత్సరాలు ఉండగా, 2016-20 నాటికి అది 70 సంవత్సరాలకు చేరింది. 2017-21 మధ్య కాలంలో తగ్గుదల నమోదు కావడానికి కారణాలు కేంద్ర ప్రభుత్వ నివేదికలో లేవు. 
 
ప్రభుత్వ నివేదిక ప్రకారం 2020-21 మధ్య కాలంలో చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో 17.3% కరోనా కారణంగా చోటుచేసుకున్నవి. వీటిని తప్పించినా కూడా ఆ కాలంలో అదనంగా 14 లక్షల మరణాలు చోటుచేసుక్నుట్లు తేలుతోంది. దీంతో కరోనా కారణంగా దేశంలో భారీ మరణాలు చోటుచేసుకున్న వాదనను తాజా గణాంకాలు బలపరుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016-20లో 70.6 సంవత్సరాలు సగటు జీవన ప్రమాణం నమోదుకాగా, 2017-21లో 70.3 నెలల కాలం నమోదైంది. 
నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆధారిత సంక్షిప్త జీవిత పట్టికలు 2017-21 ప్రకారం, “సగటున, స్త్రీల ఆయుర్దాయం పురుషుల కంటే రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. 70 సంవత్సరాల వయస్సులో కూడా, ఈ వ్యత్యాసం స్త్రీలకు ఒక సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.” పుట్టుక సమయంలో ఆయుర్దాయం ఢిల్లీలో పురుషులకు అత్యధికంగా 73 సంవత్సరాలు, కేరళలో స్త్రీలకు 77.9 సంవత్సరాలు నమోదైంది.
 
ఛత్తీస్‌గఢ్‌లో పురుషులకు 62.8 సంవత్సరాలు, మహిళలకు 66.4 సంవత్సరాలు అత్యల్పంగా నమోదైంది. “1970-75 నుండి 2017-21 వరకు పురుషులకు వార్షిక సగటు పెరుగుదల ఒడిశాలో, హర్యానాలో అత్యల్పంగా గమనించబడింది. మహిళలకు, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలో గరిష్ట వార్షిక పెరుగుదల మరియు కేరళలో అత్యల్పంగా నమోదైంది” అని నివేదిక పేర్కొంది.

కాగా, శ్వాసకోశ వ్యాధుల మరణాలు కూడా 2020లో 181,160 నుండి 2020, 2021లో వరుసగా 305,191కి పెరిగాయి. ప్రసరణ వ్యవస్థ వ్యాధుల మరణాలు కూడా ఇదే కాలంలో 580,751 నుండి 714,072కి పెరిగాయి.