చార్‌ ధామ్‌ యాత్రకు 16 లక్షల మంది

చార్‌ ధామ్‌ యాత్రకు 16 లక్షల మంది
 
చార్‌ ధామ్‌ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి (ఏప్రిల్‌ 30) నుంచి ఇప్పటి వరకూ దాదాపు 16 లక్షల మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలను సందర్శించారు. అత్యధికంగా కేవలం 30 రోజుల్లోనే కేదార్‌నాథ్‌ ఆలయాన్ని 6.50లక్షల మందికి పైగా భక్తులు సందర్శించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. 

శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. ఈ ఏడాది చార్‌ ధామ్‌ యాత్ర ఏప్రిల్‌ 30న ప్రారంభమైన విషయం తెలిసిందే. గర్వాల్‌ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు.

ఆ తర్వాత కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని మే 2న, బద్రీనాథ్‌ దేవాలయాన్ని మే 4న భక్తుల సందర్శనార్థం తెరిచారు. శీతాకాలంలో ఈ నాలుగు దేవాలయాలను మూసివేస్తారు (అక్టోబర్‌ – నవంబర్‌ నెలల మధ్య). భక్తుల భద్రత కోసం యాత్ర మార్గాల్లో దాదాపు 6,000 మంది పోలీసులు, 17 కంపెనీల ప్రొవిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ సిబ్బంది, 10 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 65కుపైగా ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బందిని మోహరించారు.