
ఆపరేషన్ సిందూర్ సమయంలో బిఎస్ఎఫ్ శౌర్యం, ధైర్యాన్ని ప్రపంచం చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మాతృభూమికి సేవ చేయడమనే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ఈ నెల 10న సరిహద్దులో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. ఈ బిహార్ కుమారునికి గౌరవపూర్వక నివాళి అర్పిస్తున్నానని చెప్పారు.
బిహార్ లో శుక్రవారం పర్యటించిన ఆయన ఉగ్రవాదం పుంజుకుంటే మళ్లీ లేవకుండా అణిచివేస్తామని హెచ్చరించారు. భారత సైన్యం దెబ్బనకు పాకిస్థాన్ ఊహించలేదనిపేర్కొంటూ ఉగ్రవాదుల స్థావరాలు శిథిలాలుగా మార్చామని, నిమిషాల్లోనే పాకిస్థాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామన్నామని ఇదే నవ భారత బలమని మోదీ చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటానని తాను బిహార్ గడ్డపై హామీ ఇచ్చానని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్నానని వెల్లడించారు.
కరకట్లో రూ.48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్ హెచ్ –22లోని పట్నా–గయా–దోభి సెక్షన్ను నాలుగు లేన్లుగా మార్చడం, ఎన్ హెచ్ –27లోని గోపాల్గంజ్ టౌన్లో దాదాపు రూ.5,520 కోట్ల విలువైన ఎలివేటెడ్ హైవే.. గ్రేడ్ మెరుగుదలను ప్రారంభించారు. వీటితో పాటు, సోన్ నగర్- మహ్మద్ గంజ్ మధ్య రూ.1,330 కోట్లతో నిర్మించిన మూడో రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు.
ఇంకా తూర్పు భారతదేశానికి ఇంధన భద్రతను చేకూర్చే లక్ష్యంతో ఔరంగాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రూ.29,930 కోట్లకు పైగా విలువైన నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-II (3×800 ఎం డబ్ల్యు)కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ పాకిస్థాన్ సహా మొత్తం ప్రపంచం భారతదేశ కుమార్తెల సిందూర శక్తిని చూశాయని తెలిపారు. ఇది మన అంబులపొదిలో ఉన్న ఒక బాణం మాత్రమే అని వారు అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం ఆగలేదని, ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, అది ఏ కలుగులో దాక్కున్నా భారతదేశం బయటకు లాగి అణచివేస్తుందని తేల్చి చెప్పారు.
గడిచిన సంవత్సరాల్లో హింస, అశాంతిని వ్యాప్తి చేసే వారిని మనం ఎలా నిర్మూలించామన్న దానికి బిహార్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని ప్రధాని మోదీ తెలిపారు. ‘కొన్నేళ్ల క్రితం ససారాం, దాని సమీప జిల్లాల్లో నక్సలిజం ఎంత ప్రబలంగా ఉండేదన్న విషయాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మావోలకు బాబాసాహెబ్ అంబేద్కర్పై నమ్మకం లేదని ధ్వజమెత్తారు.
అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా, సీఎం నితీష్ కుమార్ ఇక్కడ అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేశారని ప్రధాని ప్రశంసించారు. 2014కి ముందు 75కి పైగా జిల్లాలు నక్సల్ ప్రభావితమైనవి. ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. మావోయిస్టు హింస పూర్తిగా నిర్మూలించబడే రోజు ఎంతో దూరంలో లేదని మోదీ స్పష్టం చేశారు.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు