పీవోకే ప్ర‌జ‌లు త్వరలోనే భారత్ లో కలిసిపోతారు

పీవోకే ప్ర‌జ‌లు త్వరలోనే భారత్ లో కలిసిపోతారు
పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పీవోకే ప్రజలు తిరిగి భారత ప్రధాన స్రవంతిలో కలిసిపోయే రోజు దగ్గర్లోనే ఉందని భరోసా వ్యక్తం చేశారు. భారత్‌తో లోతైన బంధాన్ని పీవోకే ప్రజలు అనుభూతి చెందుతున్నారన్న రాజ్‌నాథ్‌, వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. త్వరలో భారత్‌లో కలిసిపోయి గర్వంగా తాము భారతీయులమని చెప్పుకుంటారని వివరించారు. 
డిల్లీలో సీఐఐ బిజినెస్‌ సమ్మిట్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్‌ పాకిస్థాన్‌తో భారత్‌ వ్యవహరించే తీరు మారిందని స్పష్టం చేశారు. పెంచి పోషించిన ఉగ్రవాదం వల్ల పాకిస్థాన్‌ ఇప్పుడు భారీ మూల్యం ఎదుర్కొంటోందని మండిపడ్డారు.

“ఉగ్రవాదాన్ని పోషించడం ఖర్చుతో కూడుకున్నది కాదు. అయితే దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో కూడా ఈరోజు పాకిస్థాన్‌కు తెలిసివచ్చింది. ఉగ్రవాదంపై వ్యూహాన్ని, ప్రతిస్పందించే విధానాన్ని భారత్ పునఃరూపకల్పన చేశాం. పాకిస్తాన్‌తో మన సంబంధాలు, చర్చల పరిధిపై కొత్త అంచనాలు వేసుకున్నాము. ఇప్పుడు చర్చలంటూ ఉంటే అది ఉగ్రవాదం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశాలపైన” అని రక్షణ మంత్రి తేల్చి చెప్పారు.

పీవోకేలో ఉన్న ప్ర‌జ‌లు భార‌త్‌తో గాఢ‌మైన బంధాన్ని ఏర్ప‌చ్చుకున్న‌ట్లు చెప్పారు. కొంద‌రు మాత్రం వాళ్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని చెబుతూ ప్రేమ‌, ఐక్య‌త‌, స‌త్యంపై న‌డిస్తే, పీవోకే మ‌న‌తో క‌లిసే రోజు ఎంతో దూరం లేద‌ని స్పష్టం చేశారు. నేను భార‌తీయుడిని, తిరిగి వ‌చ్చేశాన‌ని పీవోకే ప్ర‌జ‌లు చెప్పుకుంటార‌ని పేర్కొన్నారు. పీవోకేలోని మెజారిటీ ప్రజలు భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారని చెబుతూ అయితే కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని చెప్పుకొచ్చారు. మనం ఏదైనా చేయగలమని, అయినప్పటికీ శక్తితో పాటు సంయమనం కూడా చాలా అవసరమని రాజ్‌నాథ్ హితవు చెప్పారు.

“పీవోకేలోని ప్రజలు మనవారే, మన కుటుంబంలోని భాగమే అని నేను నమ్ముతున్నాను. ప్రధాని మోదీ చెబుతున్న “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” సంకల్పానికి కట్టుబడి ఉన్నాము. భౌగోళిక, రాజకీయ కారణాలతో మన నుంచి విడిపోయిన మన సోదరులు కూడా ఏదో ఒక రోజు వారి ఆత్మ చెప్పే మాటలు విని భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది” అని రాజ్​నాథ్​ సింగ్ తెలిపారు.

స్వదేశీ ఆయుధ రక్షణ సామర్థ్యం భారీగా పెరిగిందని రక్షణ మంత్రి తెలిపారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కేవలం వెయ్యికోట్లే ఉండేవనని చెబుతూ ఇప్పుడు అది రూ.23,500 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. భారతదేశ భద్రత కోసం రక్షణ రంగంలో మేకిన్-ఇండియా ఎంతో అవసరమని ఇప్పుడు తెలుస్తోందని రాజ్‌నాథ్‌ చెప్పారు.  ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ప్రదర్శించిన సామర్థ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ప్రస్తుతం ఫైటర్ జెట్‌లను లేదా క్షిపణి వ్యవస్థలను నిర్మించడమే కాకుండా భవిష్యత్‌ యుద్ధ సాంకేతికతలో కూడా ముందడుగు వేస్తున్నామని వివరించారు.