ఐదో తరం ఫైటర్‌ జెట్‌ ‘అమ్కా’ తయారీ

ఐదో తరం ఫైటర్‌ జెట్‌ ‘అమ్కా’ తయారీ
ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత శత్రుదేశం పాకిస్థాన్‌కు జే-35ఎస్‌ ఐదో తరం యుద్ధ విమానాలను అందించేందుకు చైనా సిద్ధమైన నేపథ్యంలో అడ్వాన్స్డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రా్‌ఫ్ట (ఏఎంసీఏ-అమ్కా) తయారీ దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఐదో తరం యుద్ధ విమానాలైన అమ్కా ఎగ్జిక్యూషన్‌ మోడల్‌ను ఆమోదిస్తూ వాటి తయారీకి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అనుమతులిచ్చారు. 
 
డీఆర్‌డీవో, ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)కు ఏఎంసీఏల తయారీ బాధ్యతలను అప్పగించారు. గత ఏడాది మార్చిలో జరిగిన భద్రతపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమావేశంలో ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో భాగంగా ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి రూ.15 వేల కోట్లను కేటాయించారు. తాజాగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. 
 
ఏడీఏ నేతృత్వంలో భారత్‌కు చెందిన ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యుద్ధ విమానాలు తయారవుతాయి. ‘ఏరో ఇండియా-2025’ సందర్భంగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయనున్న అమ్కా నమూనాను తొలిసారి ప్రదర్శించారు. ఏడీఏ ఆధ్వర్యంలో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ద్వారా ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే, 2028-29కల్లా తొలి ప్రొటోటైప్‌ నమూనా సిద్ధమవుతుందని, 2032-33కల్లా ఉత్పత్తి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
 
2034కల్లా ఐదోతరం యుద్ధ విమానాలు భారత వాయుసేనకు అందుతాయి. అమ్కా సూపర్‌సోనిక్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. ఈ విమానాలు 15 వందల కిలోల ఇంటర్నల్‌, 5,500 కిలోల ఎక్స్‌టర్నల్‌ పేలోడ్‌ను మోసుకెళ్లగలవు. ఇంటర్నల్‌ ఇంధన సామర్థ్యం 6,500 కిలోలుగా ఉంటుంది. అధునాతన స్టెల్త్‌ టెక్నాలజీ కారణంగా శత్రు రాడార్లకు చిక్కకుండా ఉంటుంది. 
 
ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థంగా తన సత్తాను చాటేలా అమ్కాను రూపొందిస్తున్నారు. భవిష్యత్‌లో మానవరహిత అమ్కాలను కూడా రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అమ్కాను రెండు దశల్లో తయారు చేయనున్నారు. మొదటి దశలో జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఎఫ్‌-414 ఇంజన్‌తో ఎంకే1 మోడల్‌ను తయారు చేస్తారు. రెండో దశలో ఎంకే2ను అలాంటి ఇంజన్‌తోనే రూపొందిస్తారు. 
 
ఇప్పటికే భారత్‌ వాడుతున్న లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రా్‌ఫ్ట(ఎల్‌సీఏ)లో కూడా ఎఫ్‌-414 ఇంజన్లను వినియోగిస్తున్నారు. ఈ ఇంజన్లను దేశీయంగా తయారు చేసేందుకు జనరల్‌ ఎలక్ట్రిక్‌తో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం కుదుర్చుకోనుంది.