ఉగ్ర‌వాదాన్ని యుద్ధ వ్యూహాంగా వాడుతున్న పాక్

ఉగ్ర‌వాదాన్ని యుద్ధ వ్యూహాంగా వాడుతున్న పాక్
పాకిస్థాన్ ఆచరిస్తున్న ఉగ్రవాదం ఉద్దేశపూర్వక యుద్ధ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి గట్టిగా బదులిస్తుందని స్పష్టంచేసారు. గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగిన గుజ‌రాత్ అర్బ‌న్ గ్రోత్ స్టోరీ 20వ సంబ‌రాల్లో పాల్గొంటూ ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన ముష్కరుల అంత్యక్రియలను పాక్‌ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని మోదీ దుయ్యబట్టారు. 

ఉగ్రవాదుల శవపేటికలపై పాక్‌ జాతీయజెండా కప్పటంతోపాటు సైన్యం సెల్యూట్‌ చేసినట్లు తెలిపారు. అందువల్ల పాక్‌ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా చేస్తున్న యుద్ధమని ప్రధాని మోదీ ఆరోపించారు.

“ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు పరోక్షయుద్ధం అనేవారం. మే 6 తర్వాత నాటి దృశ్యాలు చూసిన తర్వాత దీన్ని పరోక్షయుద్ధం కాదని అర్థమైంది. అందుకు కారణం ఉంది. ఉగ్రవాదుల 9 స్థావరాలను గుర్తించి కేవలం 22 నిమిషాల్లో ధ్వంసం చేయటం జరిగింది. ఈ సారి కెమెరాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే మనవారే ఎవరైన సాక్ష్యం అడిగితే ఇవ్వటానికి. ఇప్పుడు మనం సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అక్కడివారే ఇస్తున్నారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

2014లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో భార‌త దేశం 11వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉండేద‌ని, కానీ ఇప్పుడు మ‌న దేశం నాలుగ‌వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారింద‌ని ప్రధాని తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో బ్రిట‌న్‌ను దాటేసిన‌ప్పుడు సంతోషంగా ఫీల‌య్యామ‌ని, ఎందుకంటే ఆ దేశం మ‌న‌ల్ని పాలించింద‌ని, ఎప్పుడు 3వ స్థానానికి వెళ్లాల‌న్న వ‌త్తిడి ఇప్పుడు దేశంపై ఉంద‌ని గుర్తు చేశారు. 

పొరుగు వాళ్లు కూడా సంతోషంగా ఉండాల‌న్న భావ‌న ఉంద‌ని, కానీ మ‌న సామ‌ర్థ్యాన్ని స‌వాల్ చేస్తే, అప్పుడు భార‌త్ హీరోల‌కు నిల‌యంగా మారుతుంద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.  1947లో జరిగిన దేశ విభజన గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ “1947లో భారత్​ను మూడు ముక్కలుగా చేశారు. అదే రోజు రాత్రి కశ్మీర్​పై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదుల సాయంతోనే కశ్మీర్​లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ స్వాధీనం చేసుకుంది. సర్దార్ పటేల్ సలహాలను అంగీకరించి, ఆ రోజే ఉగ్రవాదలను చంపిఉంటే భారత్​లో గత 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఉండేవి కాదు” అని చెప్పారు. 

శరీర ఆరోగ్యం ఎంత బాగున్నా ఒక ముళ్లు గుచ్చుకుంటే చాలు ఎప్పుడూ నొప్పి కలుగుతూనే ఉంటుందని పేర్కొంటూ తాము ఆ ముళ్లును తొలగించాలని నిర్ణయించుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ గాంధీనగర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం కావటంతో ప్రధానిని అభినందించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 

రాజ్‌భవన్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌షో మహాత్మామందిర్‌ వరకు సాగింది. రోడ్డు పొడవునా వేలాదిగా బారులుతీరున ప్రజలు త్రివర్ణ పతకాలతో ప్రధానికి స్వాగతం పలికారు. రెండ్రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లో చేపట్టిన రోడ్‌షో నాల్గోది. నిన్న వడోదర, భుజ్‌, అహ్మదాబాద్‌లో ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. గతనెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌ తర్వాత తొలిసారి సొంతరాష్ట్రానికి వెళ్లిన ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.