
కొచ్చి తీరంలో మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివారం కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. ఆ నౌక ముందుగా ఒకవైపు ఒరిగిపోయి ఆ తర్వాత మెల్లగా మునిగిపోయింది.
మునిగిపోయిన నౌకలో మొత్తం 640 కంటెయినర్లు ఉండగా, వాటిలో 13 కంటెయినర్లలో ప్రమాదకర రసాయనాలు, 12 కంటెయినర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు. ఆ రసాయనాలు లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు.
కంటెయినర్లను గానీ, వాటిలో నుంచి బయటకు వచ్చిన ఇంధనం గానీ తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం లీకై ఎంత మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ‘ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ’ ని వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతోందని అధికారులు తెలిపారు.
రసాయనాల నౌక మునక కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఓడలో కాలుష్య ప్రతిస్పందన పరికరాలు ఉన్నాయి. కేరళలోని సముద్ర తీరం జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది. దేశంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇండియన్ కోస్ట్ గార్డు అన్ని చర్యలు తీసుకుంటోంది.
విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్సీ ఎల్సా-3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపటి ముందు సముద్రంలో మునిగిపోయింది. కాగా, కంటెయినర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు