
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ఆయనను అమెరికా నుంచి భారత్కు పంపించేందుకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఈ విషయంలో దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి.
ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని, భారత్ తిరిగి పంపొద్దని పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన దర్యాప్తు బృందం ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో పంపింది. కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు జూన్ 20వ తేదీ లోపు హాజరుకావాలని, లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దానితో ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ (ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ప్రభాకర్రావు పోలీసు విచారణకు హాజరుకానందున ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు అనుమతించింది. అయితే, ప్రభాకర్రావు తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం జూన్ 20వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
జూన్ 20లోగా ప్రభాకర్రావు దర్యాప్తు అధికారి ముందు హాజరు కాని పక్షంలో ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తారామతిలోని ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారుల అక్కడి గోడకు నోటీసు అంటించారు. గడువులోగా ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోతే ప్రకటిత నేరస్థుడిగా గుర్తించి ప్రభాకర్రావుకు చెందిన స్థిర, చర ఆస్తులను దర్యాప్తు అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.
కాగా, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ప్రభాకర్రావును అమెరికా నుంచి రప్పించడం కోసం దర్యాప్తు అధికారులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయించారు. ప్రభాకర్రావు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని లేకపోతే ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు ద్వారా అమెరికా అధికారులతో మాట్లాడి ఆయనను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!