నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్‌. దేశ జిడిపి 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్‌ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. పదో నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం అనంతరం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ అస్థిరత, సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. 

పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్‌ అంచనాలను ఉటంకిస్తూ అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్‌లో మనకంటే ముందు ఉన్నాయని అన్నారు. ఇదే విధంగా భారత్‌ ముందుకు సాగితే మరో రెండున్నర నుంచి మూడేళ్లలో జర్మనీని దాటుకొని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని పేర్కొన్నారు. 

ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రాబోయే దశాబ్ద కాలంలో భారత చాలా కీలకమని తెలిపారు.

“అన్ని రాష్ట్రాలు వాటి స్థాయిలో విజన్‌ డాక్యుమెంట్లు తయారు చేయాలని ప్రధానమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. అది ఇప్పటికే భారత్ ప్రగతి ప్రయాణంలో కనిపిస్తుంది. మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాం. ఇది నేను చెప్పడం లేదు, ఐఎంఎఫ్‌ విడుదల చేసిన సమాచారం. భారత్‌ ఇప్పటికే జపాన్‌ను అధిగమించింది. మనకంటే అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ముందున్నాయి” అని చెప్పారు. 

“మనం ఇదే తరహాలో ముందుకు సాగితే మరో రెండు, మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. ప్రధాని పిలుపు ఉద్దేశం ఏమంటే వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో రాష్ట్రాలే కీలకం. పారిశ్రామికాభివృద్ధి, సేవలు, వ్యవసాయం, ప్రజల ఆర్థిక వృద్ధి వంటివి అన్నీ రాష్ట్రాల్లోనే జరగాలి” అని తెలిపారు. 

“ఇందుకు రాష్ట్రాలకు ప్రత్యేకంగా విజన్‌ లేకపోతే ఒక ఎద్దుతో బండిని లాగినట్లే ఉంటుంది. అది సాధ్యం కాదు. బండి సజావుగా నడవాలంటే జోడెడ్ల మాదిరిగా కేంద్ర, రాష్ట్ర భుత్వాలు కలిసి సాగాలి. తాజా సమావేశంలో మంచి విషయం ఏమంటే 17 రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్లను తయారు చేశాయి. వాటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఐదు రాష్ట్రాలు విజన్‌ డాక్యుమెంట్లను విడుదల చేశాయి. అవి ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్, పంజాబ్. మిగతా 12 రాష్ట్రాలు ఆగస్టు నాటికి విడుదలకు సిద్ధమవుతున్నాయి” అని సుబ్రహ్మణ్యం వివరించారు.