మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. దుమారం

మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. దుమారం
కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సబ్బులు డిటర్జెంట్స్ లిమిటెడ్ తన ప్రసిద్ధ మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియాను నియమించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రూ. 6.2 కోట్ల విలువైన ఈ ఒప్పందం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. స్థానిక హీరోయిన్లు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి వంటి వారిని పక్కన పెట్టి వేరే వారిని ఎందుకు నియమించారని సోషల్ మీడియా వేదికగా అనేక మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
 
ప్రభుత్వం నిర్ణయంపై పలు పార్టీల నేతలు సహితం విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో కర్నాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ ఇది భాష, ప్రాంతీయ గుర్తింపునకు సంబంధించిన విషయం కాదని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేఎస్‌డీఎల్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సమగ్ర బ్రాండ్ వ్యూహమని చెప్పుకొచ్చారు. తమన్నాకు పెద్ద ఎత్తున ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. 
 
2030 నాటికి కేఎస్‌డీఎల్‌ అమ్మకాలను రూ.5000 కోట్లకు తీసుకెళ్లడమే తమ  లక్ష్యమని, దీనికి బలమైన మార్కెటింగ్ వ్యూహం అవసరమని చెప్పారు. తమన్నా భాటియాకు 2.8 కోట్లకుపైగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నారని, ఇది ఆమె యువతరంతో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ, దీపికా పదుకొనే వంటి హీరోయన్లను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
 
చెలరేగిందిఅయితే, ఇందులో కొందరికి వీలు కుదరలేదని, మరికొందరు వేరే బ్రాండ్స్‌కు ప్రచారకర్తలుగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లోనే తమన్నా భాటియాను తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 22న తమన్నా భాటియాను కేఎల్‌డీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వచ్చాయి. కర్నాటకకు చెందిన హీరోయిన్‌ బ్రాండ్‌ ప్రచారకర్తగా ఉండాలని డిమాండ్‌ చెలరేగింది.
అంతేకాదు ఈ నిర్ణయం ప్రభుత్వం కావాలనే తీసుకుందని సోషల్ మీడియాలో పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి రష్మిక మందన్న సహా పలువురు హీరోయిన్లు హాజరుకావాలని చెప్పినా కూడా రాలేదు. దీంతో వారిని ప్లాన్ ప్రకారమే ప్రభుత్వం పక్కన పెట్టిందని అంటున్నారు. స్థానిక నటీనటులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వడమేంటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. 

ఈ క్రమంలో ఆయా నటీనటుల అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తి 23 దేశాల్లో లభ్యమవుతోంది. 2026 నాటికి 80 దేశాలకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. ఈ క్రమంలో తమన్నా భాటియా వంటి ప్రముఖ నటిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. మైసూర్ శాండల్ సబ్బు, 1916లో స్థాపించబడిన ప్రభుత్వ సబ్బుల ఫ్యాక్టరీ ద్వారా తయారవుతుంది.