ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి

ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి
వికసిత్‌ భారత్‌ ప్రతి ఒక్కరి లక్ష్యమని చెబుతూ ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని ప్రధాని తెలిపారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది.
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని మోదీ మొదటిసారి సమావేశమయ్యారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీం ఇండియా లాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమూ కష్టం కాదని, అసాధ్యమనేది ఉండదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. “మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చి టీం ఇండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదు. ప్రతి రాష్ట్రం వికసిత్ అయినప్పుడు, భారతదేశం వికసిత్ అవుతుంది. ఇది 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్ష” అని మోదీ తెలిపారు.
అభివృద్ధి వేగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు మోదీ సూచించారు. 2027నాటికి వికసిత్‌ భారత్‌గా అవతరించేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే థీమ్‌తో ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ గురించి చర్చించారు.  దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని చెబుతూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాల నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు.
ఆవిష్కరణ, స్థిరత్వం అనేది నగరాల అభివృద్ధికి చోదక శక్తులుగా ఉండాలని సూచించారు. రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాల ప్రకారం కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలని మోదీ నిర్దేశించారు. అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఒక రాష్ట్రం- ఒక ప్రపంచ గమ్యస్థానం అన్న నినాదంతో ముందుకెళ్లాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.“అమలు చేయబడిన విధానాలు సామాన్య పౌరుల జీవితాల్లో మార్పును తీసుకువచ్చే విధంగా మనం పని చేయాలి. ప్రజలు మార్పును గ్రహించినప్పుడు మాత్రమే, అది మార్పును బలోపేతం చేస్తుంది. మార్పును ఒక ఉద్యమంగా మారుస్తుంది. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక బృందంగా మనకు గొప్ప అవకాశం ఉంది” అని ప్రధాన మంత్రి చెప్పారు.

ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, యోగి ఆదిత్యనాథ్, సుఖ్విందర్ సింగ్ సుక్కూ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరన్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు హాజరయ్యారు. అలాగే, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్​ నాథ్ సింగ్​, అమిత్ షాలతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

కాగా, ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాత్రం హాజరుకాలేదు. ఆమె హాజరు కాకపోవడంపై బిజెపి తీవ్రంగా విమర్శిస్తోంది.  బిజెపి రాజ్యసభ ఎంపి సమిక్‌ భట్టాచార్య మాట్లాడుతూ “పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరుకాకపోవడం ఆ రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరం. ఈ సమావేశానికి సిఎం హాజరు కాకపోవడం వల్ల అనేక అంశాలను లేవనెత్తే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. కేంద్రానికి వ్యతిరేకంగా వెళితే రాష్ట్రానికి ప్రయోజనం కలగదు” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.