
అక్రమ నోట్ల కట్టలు వెలుగుచూసిన కేసులో హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు నిరాకరించింది. జస్టిస్ వర్మ ప్రతిస్పందనతో పాటు మాజీ సిజెఐ రాష్ట్రపతి, ప్రధానులకు రాసిన లేఖలు, అంతర్గత విచారణ కమిటీ నివేదిక, మే 8న సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రికా ప్రకటనను పరిశీలించినట్లు జస్టిస్ అభరు ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
మాండమస్ రిట్ (ప్రభుత్వ అధికారిని ఆదేశించే కోర్టు ఉత్తర్వు) కోరే ముందు, పిటిషనర్ తగిన అధికారుల ముందు ప్రాతినిథ్యం దాఖలు చేయడం ద్వారా తమ ఫిర్యాదును పరిష్కరించుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఈ రిట్ పిటిషన్ను స్వీకరించేందుకు తాము నిరాకరిస్తున్నామని, ఈ దశలో ఇతర విజ్ఞప్తులను పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.
జస్టిస్ వర్మపై అంతర్గత విచారణ కమిటీ అభియోగం మోపిన తర్వాత మాజీ సిజెఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే రాజీనామా చేసేందుకు జస్టిస్ వర్మ నిరాకరించారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధాని మోదీలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
జస్టిస్ వర్మపైప వచ్చిన ఆరోపణలు వాస్తవమని అంతర్గత కమిటీ తేల్చిందని, వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ న్యాయవాది మాథ్యూస్ నెడుంపారా, మరో ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతర్గత విచారణతో న్యాయపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని, అయితే చట్టాల ప్రకారం.. క్రిమినల్ దర్యాప్తుకు ప్రత్యామ్నాయం కాదని పిటిషన్లో వారు లేవనెత్తారు. అంతర్గత విచారణను సవాలు చేస్తూ, అధికారిక పోలీస్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చిలో ఈ పిటిషనర్లే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!