భారత్‌, అమెరికా జులై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం!

భారత్‌, అమెరికా జులై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం!
భారత్‌, అమెరికా జులై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26 శాతం టారిఫ్‌ నుంచి పూర్తి మినహాయింపునివ్వాలని వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను భారత్‌ కోరుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 26 శాతం సుంకం, 10 శాతం ప్రాథమిక సుంకం భారత్‌ ఉత్పత్తులపై పడకుండా చూడటానికే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఏప్రిల్ 2న భారత్ ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26 శాతం టారిఫ్‌ ప్రకటించింది. ఆ తర్వాత జులై 9వరకు వాయిదా వేసింది. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను వేగవంతం చేసే దిశగా అమెరికా వాణిజ్య మంత్రితో మంచి చర్చలు జరిగాయని మంత్రి పీయూశ్ గోయల్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. యూఎస్‌ ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌ జేమిసన్‌ గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుత్నిక్‌లతో భారత వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ వాషింగ్టన్‌లో చేపట్టిన చర్చలు సానుకూలంగా నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే జులై 8లోగా తొలి దశ చర్చల ముగింపు గడువు (సెప్టెంబరు-అక్టోబరు)కు ముందే మధ్యంతర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఇందులో వస్తువులు, టారిఫేతర అడ్డంకులు, డిజిటల్‌ సేవల వంటివీ ఉండొచ్చని తెలుస్తోంది. రత్నాభరణాలు, తోలు వస్తువులు, జౌళి, గార్మెంట్లు, ప్లాస్టిక్స్‌, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పళ్లపై సుంకం తగ్గింపులను భారత్ కోరుతోంది. 

వాహనాలు, నిర్దిష్ట పారిశ్రామిక వస్తువులు, వైన్, పెట్రో రసాయన ఉత్పత్తులు, వ్యవసాయ వస్తువులు, డెయిరీ, జన్యుమార్పిడి(జీఎం) పంటల ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని అమెరికా కోరుతోంది. వాటిపై జులై 8లోగా అవగాహనకు రావాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య దేశాల (ఎమ్‌ఎఫ్‌ఎన్‌) ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల కంటే దిగువకు భారత ఉత్పత్తులపై టారిఫ్‌ తగ్గించాలంటే అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ నుంచి ట్రంప్‌ ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాల లక్ష్యంగా పెట్టుకున్నాయి.