ట్రంప్ కామెడీ పీస్ … పాకిస్థాన్ ఓ కుక్క

ట్రంప్ కామెడీ పీస్ … పాకిస్థాన్ ఓ కుక్క

ట్రంప్‌ ఓ కామెడీ పీస్ అని, భారతీయులు అతడ్ని పట్టించుకోవాల్సిన పని లేదని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమెరికా పెంటగాన్ కు చెందిన మాజీ అధికారి మైఖేల్ రూబిన్.  డొనాల్డ్ ట్రంప్‌ను పిచ్చివాడిగా,  పాకిస్తాన్‌ను కుక్కగా ఆయన ఒక ఇంటర్వ్యూలో అభివర్ణించారు. పాకిస్తాన్ ఇండియా దెబ్బకు తోకుముడిచిన కుక్కలా అయింద‌ని, కాల్పుల విరమణ కోసం పరుగులు తీసింద‌ని ఎద్దేవా చేశారు.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపింది తానేనని ట్రంప్ ప్రచారం చేసుకుంటార‌ని, భారత్, పాకిస్తాన్‌లు కలిసి భోజనం కూడా చేయాలని ట్రంప్ అన్నార‌ని గుర్తు చేశారు. ప్రతీ దానికి తానే కారణమని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటూ ఉంటార‌ని విమ‌ర్శించారు. మీరు గనుక ట్రంప్‌ను అడిగితే ఒంటి చేత్తో వరల్డ్ కప్ సాధించానంటార‌ని రూబిన్ వ్యాఖ్య‌నించారు. 

ఇంటర్‌నెట్‌ను కనిపెట్టింది తానేన‌ని,  క్యాన్సర్‌ను నయం చేసింది కూడా తానే అని ప్ర‌చారం చేసుకోవ‌డంలో ట్రంప్ దిట్ట అని పేర్కొన్నారు. ఈ విషయంలో భారతీయులు ట్రంప్‌ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక, యుద్ధంలో పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింద‌ని, భారత్ దౌత్యపరంగా, సైనికంగా విజయం సాధించింద‌ని ప్ర‌శంసించారు.

“భారత్ ఎందుకు విజయం సాధించిందని అంటున్నానంటే ఇప్పుడు అందరి చూపు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న విషయం వైపే ఉంది. ఉగ్రవాదులు చనిపోయినపుడు ఆర్మీ అధికారులు యూనిఫామ్‌లో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంటే దానర్థం అక్కడి ఉగ్రవాదులకు, ఆర్మీ వాళ్లకు తేడా లేదని” అని తెలిపారు. చరిత్ర గురించి బాగా తెలిసిన వాడిగా చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.

భారత్ యుద్ధం చేసి ఓడిపోయిన ప్రతీ సారి తామే గెలిచామని పాకిస్తాన్ జబ్బలు చరుచుకుంటోంద‌ని అంటూ పాకిస్తాన్ తన సొంత ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు.