అమీర్‌ ఖాన్‌ సినిమాకు నిరసన సెగ

అమీర్‌ ఖాన్‌ సినిమాకు నిరసన సెగ
బాలీవుడ్ స్టార్‌ హీరో అమీర్ ఖాన్‌ కు దేశంలో నిరసన సెగ తగిలింది. ఇన్నాళ్లూ ఆపరేషన్‌ సింధూర్‌ పై నోరు విప్పని ఖాన్‌ ఇప్పుడు తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్‌ లాంచ్ వేళ స్పందించడంపై మండిపడుతున్నారు. ఈ సినిమాను బాయ్​కాట్​ చేయాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు  బైకాట్ ‘సితారే జమీన్‌ పర్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండింగ్‌ చేస్తున్నారు.
 
 ట్రైలర్‌ లాంచ్‌ వేళ ఖాన్‌ తన సినిమాకు ప్రేక్షకుల మద్దతు కోరుతూ  ఆపరేషన్‌ సింధూర్‌పై ఎక్స్‌ వేదికగా “ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైనికులకు వందనం. దేశ రక్షణలో సైనికులు కనబరుస్తున్న అకుంటిత దీక్ష, వారి ధైర్యసాహసాలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు. జైహింద” అని అమీర్‌ ఖాన్‌కు చెందిన ‘అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ఎక్స్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్‌ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంగళవారం ‘సితారే జమీన్ పర్’ సినిమా ట్రైలర్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను 2007లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. అయితే సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే హీరో అమీర్‌ఖాన్‌కు నిరసన సెగ తగిలింది. సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

పహల్గామ్ ఘటన తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై అమీర్ ఖాన్ ఎప్పుడూ గొంతు విప్పలేదు. పైగా ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు మద్దతు పలికిన టర్కీ అధ్యక్షుడిని ఖాన్‌ కలిశారు. దాంతో ఆ వీడియోను వైరల్ చేస్తూ అమీర్‌ఖాన్‌పై మండిపడుతున్నారు. అప్పడు సరదాగా టర్కీలో గడిపి, ఇప్పుడు తన సినిమా కోసం సైనికులను వందనం చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. ఆయన సినిమాను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఆమిర్ ఖాన్ ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాకి కూడా ఇలానే జరిగింది. 2020లో ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఆమిర్ ఖాన్ తుర్కియే ప్రథమ మహిళ ఎమినే ఎర్డోగన్‌ను కలిసినప్పటి వివాదం. ఆ సమయంలో అమిర్‌ ఆమెను కలవడం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఎందుకంటే తుర్కియే, భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అప్పటి వివాదం ఇప్పుడు మళ్లీ మొదలైంది. .