
భారత్- పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే పాకిస్థాన్కు తుర్కియే మద్దతు ఇవ్వడంపై భారత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మన ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియేకు ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు డిల్లీలోని ప్రఖ్యాత జేఎన్యూ తాజాగా ప్రకటించింది.
దేశ భద్రత దృష్ట్యా ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను ప్రస్తుతం నిలిపేస్తున్నట్లు జేఎన్యూ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరుదేశాల యూనివర్సిటీల మధ్య ఇటీవల మూడేళ్లకు గాను విద్యాపరమైన ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం 2025 ఫిబ్రవరి 3న మూడేళ్ల కాలపరిమితికి కుదిరింది. ఇది 2028 ఫిబ్రవరి 2 వరకు అమల్లో ఉండాల్సి ఉంది.
ఇక ఇనొను యూనివర్సిటీ తుర్కియేలోని మలట్యాలో ఉంది. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఇటీవల జేఎన్యూ, ఇనొను యూనివర్సిటీల మధ్య ఎంవోయూ కుదిరింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్యూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ పాకిస్థాన్కు మద్దతు ప్రకటించడం భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ భారత లక్ష్యాలపై టర్కీ తయారుచేసి డ్రోన్లను ఉపయోగించిందన్న ఆరోపణలు మరింత ఆగ్రహానికి దారితీశాయి.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ