పుల్వామాలో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

పుల్వామాలో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. థ్రాల్‌ ప్రాంతంలోని నదిర్‌ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో నదిర్‌ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమిర్‌ నజీర్‌ వనీ, యవర్‌ అహ్మద్‌ భట్‌ హతయ్యారు.

ఇదిలా ఉండగా షోపియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగిన 48 గంటల్లోనే థ్రాల్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం షోపియన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్‌ ఉల్‌ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్‌, మ్యాగజైన్స్‌, గ్రెనేడ్స్‌ ఉన్నాయి.